మాజీ సీఎం అజిత్ జోగికి గుండెపోటు: పరిస్థితి విషమం, వెంటలేటర్ పై చికిత్స
చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను రాయపూర్ లోని శ్రీనారాయణ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
రాయపూర్: చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను స్థానికంగా ఉన్న శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 74 ఏళ్ల జోగి హోం గార్డెన్ లో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనయను ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య ఎమ్మెల్యే రేణు జోగి, కుమారుడు అమిత్ ఆస్పత్రిలో ఉన్నారు.
1946లో జన్నించిన అజిత్ జోగి భోపాల్ లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగులో పట్టు పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్టు అయిన ఆనయ కొన్నాళ్లపాటు రాయపూర్ లోని నిట్ లో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత సివిల్ పరీక్షలు రాసి ఐఎఎస్ అయ్యారు.
ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. కాంగ్రెసు పార్టీ 2016లో ఆయనను బహిష్కరించింది. దాంతో 2016లో జనతా కాంగ్రెసు చత్తీస్ గఢ్ పార్టీని స్థాపించారు.