అగ్నిపథ్ స్కీమ్ పై యూపీ, బీహార్ లో డిఫెన్స్ ఉద్యోగార్థులు ఆందోళన నిర్వహించారు. తాము రెండేళ్ల నుంచి రెగ్యులర్ రిక్రూట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని, కానీ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ కింద తాత్కాలికంగా సైనికులను నియమించుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండియన్ ఆర్మీ, ఇతర రక్షణ దళాలలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన డిఫెన్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్న ఆశావహులు.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఒక్క సారిగా నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు బుధవారం యూపీలోని లక్నోలో, బీహార్ లోని బరౌనీతో ముజఫర్పూర్లో కలిపే జాతీయ రహదారి 28పై నిరసన తెలిపారు. యువకులు టైర్లు, హోర్డింగ్లను తగులబెట్టారు. ‘‘ భారతీ దో యా అర్థి దో (మాకు ఉద్యోగాలు ఇవ్వండి లేదా మమ్మల్ని చంపండి) ’’ అంటూ నినాదాలు చేశారు. అలాగే బీహార్ లోని బక్సర్లో రైల్వే ట్రాక్లపై భారీ సంఖ్యలో అభ్యర్థులు బైఠాయించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రదర్శన ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో మమత భేటీ ప్రారంభం: నేతలను రిసీవ్ చేసుకున్న దీదీ
ప్రభుత్వం తమతో పబ్జీ ఆడుతోందని ఓ నిరసనకారుడు వ్యాఖ్యానించాడు. చాలా కాలంగా రిక్రూట్ మెంట్ వాయిదా వేస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు ఎవరూ ఏమీ అనడం లేదని తెలిపారు. అయితే రిక్రూట్ మెంట్లకు బదులు ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందని అన్నారు. దీనిపై ప్రభుత్వం తమకు సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. బక్సర్లో మరో నిరసనకారుడు మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఐదేళ్ల పదవి కాలం ఉంటుందని, అలాంటిది తాము నాలుగేళ్లలో ఏం చేస్తామని ప్రశ్నించారు.
కొంత సమయం తరువాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. తరువాత రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రైల్వే ట్రాక్ పై బైఠాయించడం వల్ల దాదాపు ఒక గంట సేపు రైలు నిలిచిపోయింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో 'అగ్నివీర్'లను నాలుగేళ్లపాటు నమోదు చేసుకోవాలని ప్రతిపాదించింది. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారిని రెగ్యులర్ కేడర్ కోసం స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ అవుతారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన అగ్నివీరుల కోసం ప్రభుత్వం సాయుధ దళాలలో ప్రత్యేక ర్యాంక్ను ఏర్పాటు చేస్తుంది.
వైద్యం కోసం ఇంటికి రమ్మన్నారు.. కిడ్నాప్ చేసి పెళ్లి చేశారు..!
ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది.
