ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకుంటోంది - బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు వసూలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. రాబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టిక్కెట్లను అమ్ముకుంటోందని తెలిపింది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఓ వీడియోను కూడా బీజేపీ విడుదల చేసింది.
ఎలక్షన్ కమీషనర్గా అరుణ్ గోయల్ బాధ్యతల స్వీకరణ.. అతని ప్రత్యేకతేంటీ?
ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సోమవారం మీడియాతో మట్లాడుతూ.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేదని అన్నారు. కానీ నేడు అదే పార్టీ దోపిడీకి పాల్పడుతోందని అన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేషన్ టిక్కెట్లను విక్రయించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లను కూడా అమ్ముకుంటోంది. ఈ విషయం స్టింగ్ ఆపరేషన్ ద్వారా స్పష్టమైంది’’ అని అన్నారు. 2020 ఎన్నికల్లో రోహిని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి రాజేష్ నామా ఆప్ కు డబ్బు చెల్లించారని ఆరోపించారు.
అయితే ఈ వాదనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతోందని అన్నారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీపై బురద జల్లుతోందని అన్నారు. అందుకే బీజేపీ ఇలాంటి వీడియోలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. బీజేపీ ఇలాంటి వీడియోలతో వస్తూనే ఉందని, అయినా వారు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ నిరూపించలేరని ఆయన అన్నారు.
కాగా.. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ఎల్జీ అధికారాలను బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. డిసెంబర్ 4వ తేదీన ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలో ఒక దానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. రెండు పార్టీలు జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. తమ గెలుపు కోసం అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు కార్పొరేషన్ల పదవీకాలం మే నెలలోనే ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7వ తేదీన వెలువడనున్నాయి.