ఇక ఓటర్ కార్డులకు ఆధార్ సీడింగ్.. పలు కీలక ఎన్నికల సంస్కరణలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఎన్నికల సంఘం సూచించిన పలు కీలక సంస్కరణలకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినేట్ పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.
దొంగ ఓట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నడుంబిగించింది. దొంగ ఓట్ల ఏరివేతలో ముఖ్యపాత్ర పోషించే ఆధార్ సీడింగ్ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. నిన్న జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఎన్నికల సంస్కరణల విషయంలో నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచిస్తున్న ఆధార్ సీడింగ్ కూడా ఉంది. అయితే ఇప్పటికే ఓటు హక్కు కల్గి ఉన్నవారు కూడా ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. కానీ ఇది స్వచ్ఛందం అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.
కీలక సంస్కరణలకు ఒకే..
కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఏళ్ల నుంచి పలు సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది. దీని వల్ల ఎన్నికల్లో పారదర్శకత లభిస్తుందని భావిస్తుంది. అందులో భాగంగానే నిన్న కేబినేట్లో పలు అంశాలను ప్రస్తావించింది. వీటికి మంత్రి వర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాలతో ఎన్నికలు, ఓటరు కార్డుల విషయంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఎంతో మంది ఓటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు..
ఇక ఏడాదిలో నాలుగు సార్లు ఓటరు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని కూడా బుధవారం జరిగిన కేబినేట్ సమావేశం ఆమోదించింది. ప్రస్తుతం ఏడాదికి ఒకే సారి కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు మారనుంది. ప్రతీ ఏటా ఎన్నిల సంఘం జనవరి నెలలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంటుంది. ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీని కటాఫ్గా నిర్ణయిస్తుంది. జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన వారందరినీ అర్హులుగా గుర్తించి వారికి ఓటరు కార్డులు జారీ చేస్తుంది. ప్రతీ గ్రామంలో ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ కొత్తగా ఓటరు నమోదు చేస్తుంటారు. డిగ్రీ కాలేజెస్, ఇతర ఇంజనీరింగ్ కాలేజ్ లలో ఎన్నికల సంఘం అధికారులు క్యాంపులు పెట్టి మరీ ఓటరు నమోదు జరుపుతుంటారు. అయితే ఈ పద్దతి వల్ల చాలా మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందలేకపోతున్నారు. జనవరి ఒకటో తేదీ కటాఫ్ గా నిర్ణయించడం వల్ల అదే నెలలో 18 ఏళ్లు నిండే యువతకు ఓటరు కార్డులు లభించడం లేదు. ఉదాహరణకు జనవరి 2వ తేదీన 18 ఏళ్లు నిండిన యువకుడికి, ఫిబ్రవరి నెలలో 18 ఏళ్లు నిండిన యువకుడికి ఓటు హక్కు పొందే అర్హత ఉండదు. దీంతో ఆ ఏడాదిలో వచ్చే ఏ ఎన్నికల్లో కూడా వారు ఓటు ఆ యువత ఓటు వేసే అవకాశం ఉండదు. ఈ విషయంలో చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. అందుకే ఇప్పుడు ఎన్నికల సంఘం ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహిస్తుంది. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు ఓటు వేసే అవకాశం కలుగుతుంది.
కేజ్రీవాల్ తిరంగా యాత్ర.. పంజాబ్లో కాకరేపుతున్న రాజకీయం !
ఉద్యోగ భాగస్వామి విషయంలోనూ మార్పులు..
ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామి ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ సంస్కరణ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు భర్త ఓ ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ భార్యకు కూడా సర్వీస్ ఓటు అందించే వారు కానీ భార్య ఉద్యోగం చేస్తుంటే భర్తకు మాత్రం ఓటు హక్కు ఉండకపోయేది. అయితే వివక్షను రూపుమాపేందుకు ఓ మార్పు తీసుకొచ్చారు. భార్య ఉద్యోగం చేస్తున్న చోటనే భర్తకు కూడా సర్వీస్ ఓటు కల్పించనున్నారు. ఈ మూడు నిర్ణయాలతో పాటు ఎన్నికల సమయంలో ఏ భవనాన్ని అయినా ఎన్నికల సంఘం వాడుకునే అవకాశాన్ని కేంద్ర కల్పించింది. ఇన్ని రోజులు ప్రభుత్వ పాఠశాలను, ఇతర ప్రభుత్వ భవనాలను మాత్రమే ఎన్నికల సంఘం ఉపయోగించుకుంటోంది.