మూడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ అత్యాచారం.. నిందితుడి ఇళ్లు కూల్చేసిన అధికారులు..
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు అయిన బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చేశారు. మూడేళ్ల చిన్నారిపై అతడు బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని మంగళవారం అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేత షాపురా ప్రాంతంలో పోలీసుల పర్యవేక్షణలో జరిగాయి. అయితే నిందితుడు అక్రమంగా ఇంటిని నిర్మించాడని, అందుకే దానిని కూల్చివేశామని అధికారులు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
నర్సరీలో చదువుతున్న మూడున్నరేళ్ల బాలికపై ఆ బస్సు డ్రైవర్ బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బస్సు డ్రైవర్ ను, మహిళా అటెంటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత బాలిక భోపాల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా బస్సు డ్రైవర్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ పాప బ్యాగ్ లో ఉన్న అదనపు యూనిపామ్ ను వేశాడు. ఎప్పటిలాగే ఇంటి వద్దే చిన్నారిని వదిలేశాడు.
అంబులెన్స్ లేటవుతుందని జేసీబీలో హాస్పిటల్ కి .. ఎక్కడ జరిగిందంటే?
అయితే చిన్నారి తన ప్రైవేట్ పార్ట్ లో నొప్పి ఉందని బాధపడింది. తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా..డ్రైవర్ చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు మరుసటి రోజు స్కూల్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడిని ఆ బాలిక గుర్తించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సెప్టెంబర్ 12వ తేదీన ఆ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిపై డ్రైవర్ అత్యాచారం చేస్తున్న సమయంలో మహిళా అటెండర్ కూడా అక్కడే ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
వారిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376-AB (12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పాఠశాల యాజమాన్యం దిగ్భ్రాంతికరమైన ఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిందని అర్థం అవుతుందని తెలిపారు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యాన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తారని, వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజస్థాన్లో విషాదం.. విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి..
విధానసభ మాజీ డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే హీనా కవారే మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలు జరగడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ సున్నితత్వమే కారణమని ఆరోపించారు. ‘‘ కేవలం చట్టాలను రూపొందిస్తే సరిపోదు. వాటిని సరైన విధంగా అమలు చేయాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పట్ల సున్నితంగా ఉంది. మేము విధానసభలో ఈ సమస్యను ప్రధానంగా లేవనెత్తుతాము ’’ అని అన్నారు.
ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) భోపాల్ జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. ఈ సంఘటనపై మూడు రోజుల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు ప్యానెల్ను ఏర్పాటు చేసింది.