యేడేళ్ల చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఆ తరువాత ఆ చిన్నారిని హత్య చేశాడు. తరువాత ఏమీ తెలియనట్టుగా గప్ చిప్ గా ఉన్నాడు. చివరికి చిన్నారి మృతదేహం దొరకడంతో పోలీసులకు దొరికిపోయాడు.
ముంబై : రోజురోజుకూ చిన్నారుల మీద లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. చాక్లెట్ ఆశచూపో, చిప్స్ ఆశచూపో వారిని కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడుతున్నారు కామాంధులు. ఆ తరువాత చిన్నారి ఎక్కడ తమ గుట్టు బయటపెడుతుందో అనే అనుమానంతో హత్య చేసి.. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేస్తున్నారు. ఇలాంటి నేరాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. అయితే చిన్నారుల మీద ఈ దారుణాలకు పాల్పడుతున్నది చాలాసార్లు తెలిసినవారు, ఇంటి చుట్టుపక్కల వారే అవుతుండడంతో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మొద్దో.. తన చిన్నారులను ఎలా కాపాడుకోవాలో తెలియక భయపడుతున్నారు.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు తేజస్ దల్వీ (24)ని పూణే జిల్లా పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన తేజస్ తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే... పూణే జిల్లా మావళ్ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈ నెల రెండో తేదీన కనిపించకుండా పోయింది.
అర్పిత ప్రాణాలకు ముప్పు ఉంది.. జైల్లో ఆహారం, నీరు తనిఖీ చేయండి - ఈడీ తరుఫు న్యాయవాది
తల్లిదండ్రులు ఊరంతా గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా తమదైన శైలిలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల నగ్న స్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త దావానలంలా ఊరంతా పాకింది. విషయం తెలియడంతో పెద్దసంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోస్ట్ మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
గ్రామస్తులు ఆగ్రహాన్ని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే కామాంధుడు తేజస్ దల్వీని అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ శల్కే వెల్లడించారు. ఆతర్వాత చేపట్టిన విచారణలో తేజస్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బాలిక ఉంటున్న పక్క ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలియగానే మావళ్ తాలూకా హద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కోఠార్ణే గ్రామానికి తరలివచ్చారు. అంతటితో ఊరుకోకుండా నిందితుడిని ఉరి తీయాలంటూ విద్యార్థులు, మహిళా సంఘాలు, స్థానికులు మోర్ఛా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మహిళా కమిషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా జరిపించి నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.
