దారుణం.. ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి, హత్య
హైదరాబాద్ నగరలో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల దాహానికి ఓ పసివాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
హైదరాబాద్ నగరలో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల దాహానికి ఓ పసివాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏడేళ్ల బాలుడిపై నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడి తలపై బండరాయి మోది చంపేసిన ఘటన హైదరాబాద్ పహాడిషరీఫ్లో జరిగింది.
కర్ణాటకకు చెందిన బాషా కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. పహాడిషరీఫ్ ప్రాంతంలోని ముస్తఫాహిల్స్ ప్రాంతంలో భార్య, నలుగురు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో కూల్ డ్రింక్ తెచ్చుకోవడానికి బాలుడు దుకాణానికి వెళ్లాడు. కాగా..రాత్రివేళ ఒంటరిగా వెళ్తున్న బాలుడ్ని గమనించిన కామాంధులు బలవంతంగా బాలుడ్ని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు.
చెట్ల పొదలలో ఓ చోట ఖాళీగా ఉన్న ప్రాంతానికి బాలుడుని తీసుకువెళ్లి... లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో డాబాపై ఉన్న ఓ మహిళ ఇదంతా గమనించి బిగ్గరగా కేకలు వేసింది.
బాలుడు బయటపడితే నిజం చెబుతాడని భావించిన ఆ కామాంధులు.. బాలుడి తలపై బండరాయి పడేసి చంపేసి పరారయ్యారు. చీకట్లో పారిపోతున్న ఆ హంతకులను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే వాళ్లు పారిపోవడంతో చీకట్లో వారిని గుర్తించలేకపోయామని చెప్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.