బీహార్లో దారుణం...60 ఏళ్ల టీచర్ పై మహిళా కానిస్టేబుళ్ల లాఠీఛార్జ్..
బీహార్లోని కైమూర్లో ఓ వృద్ధ ఉపాధ్యాయుడిని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిమీద 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని డిఎస్పీని జిల్లాపోలీసు సూపరింటెండెంట్ నివేదిక కోరారు.
బీహార్ : బీహార్లోని కైమూర్ జిల్లాలో శుక్రవారం పట్టపగలు 60 ఏళ్ల టీచర్ని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సమయంలో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బర్హులీ గ్రామానికి చెందిన నావల్ కిషోర్ పాండే అనే వ్యక్తిని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు లాఠీలతో కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. భబువాలోని జై ప్రకాష్ చౌక్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నవల్ కిషోర్ పాండే అనే టీచర్ తన సైకిల్పై రోడ్డు దాటుతుండగా మహిళా కానిస్టేబుళ్లు సైకిల్ ఆపమని అడిగారు. ఆ వ్యక్తి ఆగలేదు. ఏదో మాట్లాడాడు. అయితే, అతను తమను దుర్భాషలాడాడని కానిస్టేబుళ్లు భావించారని తెలుస్తోంది. దీంతో కానిస్టేబుళ్లు అతని సైకిల్ను లాక్కుని, కారణం లేకుండా కొట్టడం ప్రారంభించారు.
భార్యతో వివాహేతర సంబంధం అనుమానం.. యువకుడిని చంపి, 10 ముక్కలు చేసి.. మూడు సంచుల్లో కుక్కి...
ఈ వీడియోలో, ఆ వృద్ధ టీచర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. అతని చేతుల మీద అనేక దెబ్బలు పడినట్లు చూడవచ్చు. తనను విడిచిపెట్టమని అతను వారిని వేడుకున్నాడు. కాని ఇద్దరు మహిళలు అతని మీద కేకలు వేస్తూ, కొట్టడం కొనసాగించారు. "నేను డిపిఎస్ పర్మల్పూర్లో ఇంగ్లీష్ టీచర్ని. నేను సైకిల్తో రోడ్డు దాటుతుండగా ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు నన్ను అడ్డుకున్నారు. వారు నన్ను ఆపారు, కానీ నేను పట్టించుకోకుండా ముందుకు కదిలాను" అని అతను చెప్పాడు.
"ఒక కానిస్టేబుల్ సైకిల్ ముందుకి వచ్చి, మరొకరు నా సైకిల్ వెనుక నిలబడి లాఠీచార్జ్ చేశారు, నేను వారిని ఆపమని అడిగారు, కానీ వారు వినలేదు, నాపై 20 రౌండ్లకు పైగా లాఠీల వర్షం కురిపించారు. ఒక వ్యక్తి ఇందులో జోక్యం చేసుకున్న తర్వాతే వారు ఆగారు. నేను చాలా అవమానపడ్డాను. దీంతో నేను పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వారి కొట్టిన దెబ్బల కారణంగా, నా కాళ్ళు, చేతులు వాచిపోయాయి, నాకు న్యాయం కావాలి"అని బాధిత టీచర్ చెప్పారు.
ఈ సంఘటన తర్వాత, కైమూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) లలిత్ మోహన్ శర్మ మాట్లాడుతూ, తాను వీడియో క్లిప్ను చూశానని, విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 24 గంటల్లోగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నుంచి నివేదిక కోరారు. ఎస్పీ లలిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆ ప్రాంత డీఎస్పీని కోరాం. ప్రాథమిక విచారణను పరిశీలిస్తే.. నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
అయితే, సదరు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను మూడు నెలల పాటు ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం.