59 చైనా యాప్లపై నిషేధం: మరి జూమ్ను ఏం చేస్తారు..? ప్రభుత్వానికి నెటిజన్ల ప్రశ్నలు
59 చైనీస్ యాప్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత దృష్ట్యా టిక్టాక్, హలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి పాపులర్ యాప్లను నిషేధించింది.
గాల్వన్ లోయలో భారత్- చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో యావత్ దేశం చైనాపై రగిలిపోయింది. ఆ దేశానికి చెందిన వస్తువులను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
ఈ క్రమంలో 59 చైనీస్ యాప్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత దృష్ట్యా టిక్టాక్, హలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి పాపులర్ యాప్లను నిషేధించింది.
దీంతో ప్రభుత్వ నిర్ణయంపై భారత్తో పాటు పలు దేశాల్లోనూ చర్చ నడుస్తోంది. ఈ యాప్లపై నిషేధం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు అంటుండగా.. నిజంగా ప్రజల గోప్యత హక్కును పరిరక్షించాలంటే వీడియో కాలింగ్ యాప్ జూమ్ను కూడా బ్యాన్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:టిక్టాక్ స్థానంలో ఇండియన్ యాప్.. గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్..
నిజానికి జూమ్ అమెరికా కేంద్రంగా పనిచేసే కంపెనీకి చెందినది. అమెరికా పౌరసత్వం కలిగిన చైనీస్- అమెరికన్ ఎరిక్ యువాన్ దీనిని స్థాపించారు. దీనిని ప్రారంభించే సమయంలోనే ఇది అమెరికన్ యాప్ అంటూ ఆయన ప్రకటించారు.
అయితే చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్వేర్ను ఉపయోగించడం వల్ల డేటా చోరీకి గురయ్యే అవకాశం వుందని నిఘా వర్గాలు గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో జూమ్ యాప్ పేరు కూడా ప్రస్తావించారు.
దీంతో ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్ను వినియోగించరాదంటూ కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జర్మనీ, తైవాన్ ప్రభుత్వాలు జూమ్ను నిషేధించడంతో దాని భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జూమ్ విశ్వసనీయతపై చర్చ లేవనెత్తిన వాళ్లు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు జూమ్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర మరే ఇతర యాప్ల వల్లనైనా వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం వుందని సోషల్ మీడియా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని కొందరు కోరుతున్నారు.