దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు.. రంగంలోకి పోలీసులు.. 44 కేసులు, నలుగురు అరెస్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది. మోదీని గద్దె దించాలని (మోదీ హఠావో, దేశ్ బచావో) కోరుతూ ఆ పోస్టర్లలో రాసి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది. మోదీని గద్దె దించాలని (మోదీ హఠావో, దేశ్ బచావో) కోరుతూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గోడలు, స్తంభాలపై పోస్టర్లను అతికించారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించి 44 కేసులు నమోదు చేశారు. అలాగే నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు మంగళవారం చేపట్టిన భారీ ఆపరేషన్లో పోలీసులు ఢిల్లీలోని పలు చోట్ల దాదాపు 2,000 మోదీ వ్యతిరేక పోస్టర్లను తొలగించారు. ఈ పోస్టర్లలో చాలా వరకు 'మోదీ హటావో, దేశ్ బచావో' (మోదీని తొలగించండి, దేశాన్ని రక్షించండి) అనే నినాదం ఉంది.
ఢిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరవేస్తున్న మరో 2,000 పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఒక వ్యాన్ను అడ్డగించిన పోలీసులు అందులో 2,000 పోస్టర్లను కనుగొన్నారు. పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని తనకు సూచించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. సోమవారం కూడా ఇదే విధంగా పోస్టర్లను పంపిణీ చేసినట్టుగా చెప్పాడు.
50,000 ‘‘మోదీ హఠావో..దేశ్ బచావో’’ పోస్టర్లను ముద్రించాలని తమకు ఆర్డర్ వచ్చిందని అరెస్టయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు.