‘35కి 38 మార్కులు వచ్చాయి’ అదేలా..?
బిహార్ లో మార్కుల గందరగోళం
విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్స్ విషయంలో బిహార్ రాష్ట్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తక్కువ మార్కులు వచ్చినందుకో, టాప్ ర్యాంకులు వచ్చినందుకో కాదు.. రావాల్సిన దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చిందుకు. అర్థంకాలేదా..? పరీక్ష 35 మార్కులకు పెడితే.. కొందరు స్టూడెంట్స్ కి 38 మార్కులు వచ్చాయి. ఇక కొందరికైతే.. అటెండ్ కానీ పరిక్షకు కూడా మార్కులు వేశారు.
తాజాగా బిహార్ లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో అర్వాల్ జిల్లాకు చెందిన భీమ్ కుమార్ అనే విద్యార్థి... మ్యాథమేటిక్స్ థియరీలో మొత్తం(టోటల్) 35 మార్కులకు 38 మార్కులు పొందాడు. అదేవిధంగా అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో కూడా తనకు 35కు 37 మార్కులు వచ్చినట్టు ఆ విద్యార్థి చెప్పాడు.
మార్కులు చూశాక.. తనకు కొంచెం కూడా షాకింగ్ గా అనిపించలేదట. ఎందుకంటే వారి స్టేట్ బోర్డ్ లో ఇలాంటి మ్యాజిక్ లు తరచూ జరుగుతూనే ఉంటాయని చెప్పడం గమనార్హం. భీమ్ కుమార్తో పాటు సందీప్ రాజ్కు కూడా ఇదే విధంగా ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చినట్టు తెలిసింది. ఫిజిక్స్ థియరీ పేపర్లో తనకు 35 మార్కులు గాను, 38 మార్కులు వేసినట్టు చెప్పాడు. ‘ఇది ఎలా సాధ్యమవుతుంది. ఇంగ్లీష్, రాష్ట్ర భాషలో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో నాకు జీరో మార్కులు వచ్చాయి’ అని అన్నాడు.
రాహుల్ అనే మరో విద్యార్థికి కూడా మ్యాథమేటిక్స్లో అబ్జెక్టివ్ పేపర్లో 35 మార్కులకు 40 మార్కులు వేశారని తెలిసింది. మరికొంత మంది విద్యార్థులు తాము కనీసం పరీక్షకు హాజరుకాకపోయినా.. ఆ సబ్జెట్లలో మార్కులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇలా తప్పులుతడకలుగా మార్కులు వేసి, బిహార్ ఎగ్జామినేషన్ బోర్డు మరోసారి వివాదాస్పదంగా మారింది.