బీజేపీ ఎంపీ కారు ఢీకొని రెండో తరగతి బాలుడి మృతి.. ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో ఘటన
రెండో తరగతి చదివే బాలుడిని బీజేపీ ఎంపీకి చెందిన ఎస్యూవీ ఢీకొట్టింది. దీంతో ఆ పిల్లాడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. రాజధాని లక్నోకి సమీపంలోని ఓ జిల్లాలో బీజేపీ ఎంపీకి చెందిన కారు ఢీకొనడంతో రెండో తరగతి చదివే బాలుడు చనిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్... నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోస్ట్...!
వివరాలు ఇలా ఉన్నాయి.. హార్దియా ప్రాథమిక పాఠశాలలో అభిషేక్ రాజ్భర్ అనే విద్యార్థి రెండో తరగతి చదవుతున్నాడు. ప్రతీ రోజు తన ఇంటి నుంచి కాలినడకన పాఠశాలకు వెళ్లేవాడు. అలాగే శనివారం కూడా పాఠశాలకు సెలవు ప్రకటించిన తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. అయితే హార్దియా పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేదీకి చెందిన రెండు వాహనాలు ఆ దారి గుండానే వెళ్తున్నాయి. రోడ్డు దాటుతున్న అభిషేక్ రాజ్భర్ ను ఓ ఎస్యూవీ ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆ పిల్లాడిని లక్నోలోని ట్రామా సెంటర్కు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్ కు చేరుకోకముందే పరిస్థితి విషమించి ఆయన మరణించారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం సాయంత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు బీజేపీ ఎంపీ కి చెందిన ఎస్యూవీ నడిపిన గుర్తు తెలియని డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని బస్తీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. 87 సెకన్ల సీసీటీవీ ఫుటేజీలో రెండు ఎస్యూవీలు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇందులో ఓ ఎస్యూవీ బంపర్ కూడా దెబ్బతింది. ఈ కేసును సీవో ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో ఎంపీ, ఆయన వాహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని బాధిత చిన్నారి తండ్రి శత్రుఘ్న రాజ్భర్ తెలిపారు. అయినప్పటికీ ఎంపీ, డ్రైవర్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ రాజ్భర్ తన ఒక్కగానొక్క కుమారుడని, బాలుడిపై తాము చాలా ఆశలు పెట్టుకున్నామని అన్నారు. కాగా.. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు కూడా ఎంపీ రాలేదని స్థానికులు మీడియాకు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా‘ నివేదించింది.