25 ఏళ్లు విడిగా ఉంటున్న దంపతులు విడాకులు కావాలన్నారు.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే?
ఆ దంపతులు 1994లో పెళ్లి చేసుకుని నాలుగేళ్లు కలిసి ఉన్నారు. ఆ తర్వాత 25 ఏళ్లపాటు వేరుగానే ఉన్నారు. వీరు తమకు విడాకులు మంజూరు చేయాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వారికి విడాకులు మంజూరు చేసింది.
![25 years apart, couple sought divorce, this is what supreme court said kms 25 years apart, couple sought divorce, this is what supreme court said kms](https://static-ai.asianetnews.com/images/01gywk3rp3d6v8sh5tbsmx7z38/supreme_363x203xt.jpg)
న్యూఢిల్లీ: ఆ జంటకు 1994లో ఢిల్లీలో పెళ్లి జరిగింది. నాలుగేళ్లు కలిసే ఉన్నారు. కానీ, ఆ తర్వాత ఇద్దరు విడిగా ఉంటున్నారు. భర్త, అతని సోదరుడిపై ఆమె వరకట్న వేధింపుల కేసు వేసింది. జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన తర్వాత ఆ భర్త ఆమెకు విడాకుల నోటీసులు పంపాడు. ఆ తర్వాత ఇద్దరూ వేరుగానే ఉంటున్నారు. తమకు విడాకులు మంజూరు చేయాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జేపీ పర్దీవాలాలు విచారించారు. వారిద్దరి మధ్య అర్థవంతమైన సంబంధాలు పూర్తిగా లేకుండా పోయాయని, ఇద్దరి మధ్య ఇప్పటికీ ఆగ్రహావేశాలే ఉన్నాయని తెలిపారు. దీన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్లోని క్రూయెల్టీ కింద చూడాలని పేర్కొన్నారు. వారికి విడాకులు మంజూరు చేశారు.
‘మన ముందు పెళ్లైన దంపతులు ఉన్నారు. ఓ నాలుగేళ్లు కలిసి జీవించారు. ఆ తర్వాత 25 ఏళ్లుగా వేరు వేరుగా ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. వారి వైవాహిక బంధం పూర్తిగా దెబ్బతినింది. దాన్ని సరిపుచ్చలేని స్థాయికి వెళ్లింది’ అని సుప్రీంకోర్టు తెలిపింది.
‘ఈ సంబంధం ఇకపై కొనసాగరాదనే దానిలో సందేహమేమీ లేదు. దీని కొనసాగింపు అంటే క్రూరత్వాన్ని మంజూరు చేయడమే. దీర్ఘకాలిక వేర్పాటు, కలిసి దగ్గరగా జీవించకుండా ఉండటం, అర్థవంతమైన సంబంధాలున్నీ తెగిపోయి, కేవలం కోపాలే మిగిలి ఉన్న ఈ స్థితిని హిందూ మ్యారేజీ యాక్ట్లోని క్రూయెల్టీగా చూడాలి’ అని వివరించింది. వారి వైవాహిక బంధం తెగదెంపులు కేవలం వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వారికి పిల్లలు లేరు.
ఆ వ్యక్తి నెలకు రూ. లక్షకు పైగానే సంపాదిస్తున్నారు. కాబట్టి, ఆమెకు రూ. 30 వేలు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ దంపతులు 1994లో పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరంలో ఆమె ఆయనకు చెప్పకుండా గర్భస్రావం చేసుకుందని భర్త ఆరోపించాడు. తమ ఇల్లు చిన్నగా ఉన్నందున ఆమెకు నచ్చలేదని ఆమె ఫిర్యాదు చేసినట్టూ వివరించాడు.
Also Read: ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం లభ్యం.. రోమన్ సామ్రాజ్యంతో ప్రాచీన భారతానికి మధ్య వాణిజ్య సంబంధాలు!
నాలుగేళ్ల తర్వాత వరకట్న వేధింపుల కేసు వేసింది. భర్త, ఆయన సోదరులు ఈ కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత అతను విడాకుల కోసం పిటిషన్ వేశారు.
క్రుయెల్టీ, దీర్ఘకాలం వేరుగా ఉంటున్న కారణాలను చూపి ట్రయల్ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కానీ, ఢిల్లీ హైకోర్టు మాత్రం విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. ఈ తీర్పునే సుప్రీంకోర్టులో భర్త సవాల్ చేశాడు.