సారీ, ఫాదర్: రైలు ఢీకొట్టి ఇద్దరు బాలికల మృతి
ఢిల్లీలోని తుగ్లక్ బాద్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు బాలికల శవాలను పోలీసులు గుర్తించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లక్ బాద్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు బాలికల శవాలను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలుగులోకి వచ్చింది. బాలికలను రైలు ఢీకొట్టింది.
వెంటనే వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బాలికలు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
సంఘటన స్థలం వద్ద పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. అందులో సారీ, ఫాదర్ అని రాసిన నోట్ కనిపించింది. ఇద్దరు బాలికల్లో ఓ బాలిక తల్లి కొన్నేళ్ల క్రితం మరణించింది. దాంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు.
బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికలకు 12వ తరగతి విద్యార్థినులై ఉంటారా, సిబిఎస్ సీ ఫలితాల పట్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.