Kashmir Encounter: ఎన్కౌంటర్లో ఇద్దరు వ్యాపారులు మృతి.. పోలీసులే చంపారన్న కుటుంబీకులు
జమ్ము కశ్మీర్లోని హైదర్పొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులతోపాటు ఇద్దరు వ్యాపారులు మరణించారు. పోలీసులు వారిని టెర్రరిస్టు మద్దతుదారులని పేర్కొన్నారు. కానీ, వారి కుటుంబ సభ్యులు పోలీసుల వాదనను ఖండించారు. వారిని పోలీసులే చంపేశారని ఆరోపించారు. అంతిమ సంస్కారాలకూ వారి మృతదేహాలను అప్పజెప్పాల్సిందిగా కోరగా.. పోలీసులు తిరస్కరించారు. లా అండ్ అర్డర్ సమస్య కారణంగా వీలుపడదని, వారిని మిగతా ఇద్దరు ఉగ్రవాదులతోపాటే హంద్వారా ఖననం చేసినట్టు చెప్పారు.
శ్రీనగర్: Jammu Kashmirలో మరో Encounter జరిగింది. శ్రీనగర్లోని Hydereporaలో భద్రతా బలగాలు చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు Terroristలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు Businessmenలు ఉన్నారని వివరించారు. వీరిద్దరూ టెర్రరిస్టు మద్దతుదారులని పేర్కొన్నారు. డాక్టర్ ముదాసిర్ గుల్, అల్తాఫ్ భట్లకు ఎన్కౌంటర్ జరిగిన హైదర్పొరా ప్రాంతంలోనే షాపులు ఉన్నాయి. ముదసిర్ గుల్ డెంటల్ సర్జన్ ట్రైనీ. ఎన్కౌంటర్ జరిగిన కాంప్లెక్స్లో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నారు. అల్తఫ్ భట్ ఆ కమర్షియల్ కాంప్లెక్స్ యజమాని. ఆయన కూడా ఓ హార్డ్వేర్ షాప్, సిమెంట్ షాప్ను నడుపుతున్నారు.
ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. అమాయక పౌరులను మానవ కవచాలుగా వినియోగించి ఎదురకాల్పుల్లో వారు చనిపోయేలా చేస్తారని ఆరోపించారు. తర్వాత మరణించిన ఆ అమాయకులను పోలీసులు తమకు అనుకూలంగా ఉగ్రవాద మద్దతుదారులని చేతులు దులిపేసుకుంటారని వివరించారు. ఆ అమాయక ప్రజలనే ఓవర్ ద గ్రౌండ్ టెర్రరిస్టులని ఓ లేబల్ వేస్తారని మండిపడ్డారు. ఇదే కేంద్ర ప్రభుత్వ రూల్ బుక్లో ఉన్న విధానాలని ఆరోపించారు. ఈ ఘటనపై విశ్వసనీయంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి సత్యాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక సంస్కృతికి స్వస్తి చెప్పాలని తెలిపారు.
Also Read: కశ్మీర్లో థర్డ్ వేవ్? హాట్స్పాట్గా శ్రీనగర్.. పెరుగుతున్న కరోనా కేసులు
ఆ ఇద్దరిని పోలీసులే చంపేశారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ, పోలీసులు మాత్రం వారు క్రాస్ఫైరింగ్ చనిపోయారని వివరించారు. లేదా టెర్రరిస్టులే వారిని కాల్చి చంపారని చెబుతున్నారు. ‘మా అంకుల్ మొహమ్మద్ అల్తఫ్ భట్ను హైదర్పొరాలో మీరే చంపేశారు. ఒక మానవ కవచం లాగా మీరు ఆయనను వాడుకున్నారు. ఇప్పుడు ఓవర్ ద గ్రౌండ్ టెర్రరిస్టు అంటున్నారు. ఆయన మృతదేహాన్ని మాకు అప్పగించండి’ అంటూ సైమా భట్ ట్వీట్ చేశారు.
ఇద్దరి వ్యాపారుల మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయడానికి డెడ్ బాడీలను తమకు అప్పగించాల్సిందిగా కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. కానీ, పోలీసులు తిరస్కరించారు. జమ్ము కశ్మీర్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా ఈ ఇద్దరు వ్యాపారుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఇవ్వడం కుదరడం లేదని పోలీసులు తెలిపారు. అయితే, మిగతా ఇద్దరు టెర్రరిస్టులతో కలిపి ఉత్తర కశ్మీర్లోని హంద్వారా ఏరియాలో ఖననం చేసినట్టు వివరించారు.
Also Read: జమ్మూ ఎస్కెఐఎంఎస్ మెడికల్ కాలేజీ లో ఉగ్రవాదుల కాల్పులు: తిప్పికొట్టిన ఆర్మీ
ఈ ఘటనపై తొలుత స్పందిస్తూ ఈ ఇద్దరు వ్యాపారులు గాయపడ్డారని, ఆ తర్వాత టెర్రరిస్టుల కాల్పుల్లోనే వారు మరణించారని తెలిపారు. ఆ తర్వాత ప్రకటనను కొంత మార్చారు. వారిద్దరు టెర్రరిస్టులతో జరిగిన క్రాస్ఫైరింగ్లో చిక్కుకుని ఉండవచ్చునని వివరించారు. ఎన్కౌంటర్ స్థలంలో రెండు పిస్టల్స్ దొరికాయని, ఆ కాంప్లెక్స్లో నడుపుతున్న కాల్ సెంటర్లను టెర్రరిస్టు కార్యకలాపాల కోసం వినియోగించారని పోలీసులు తెలిపారు. ముదాసిర్ నడుపుతన్న కంప్యూటర్ సెంటర్కు అనుమతులు లేవని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వివరించారు.