కట్టెలకోసం పోయి, పులి నోటికి చిక్కి.. 18యేళ్ల యువకుడి మృతి..
కట్టెలకోసం వెళ్లిన ఓ యువకుడి మీద పులి దాడి చేసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో కలకలం సృష్టించింది.
కర్ణాటక : పులులు జనావాసాల్లోకి వచ్చి మనుషుల మీద దాడి చేస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చిరుతపురులు అనేకమందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద పులులు కూడా జనాలమీదికి విరుచుకుపడుతున్నాయి. మైసూరు జిల్లాలోని హెచ్డి కోటే పరిధిలో డిబి కుప్ప వద్ద ఉన్న నాగరహోళె అడవుల్లోని బళ్లె ప్రాంతంలో ఆదివారం ఓపులి యువకుడిని చంపేసింది. ఈ ఘటనలో చనిపోయిన యువకుడిని మంజు(18)గా గుర్తించారు.
ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవి ప్రాంతంలో కట్టెలు ఏరుకోవడానికి మంజు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పులి మంజు మీద దాడి చేసింది. పులిదాడిలో మంజు తల వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. పంజాతో తల వెనుక భాగంలో చీల్చి, నోటితో కొరకడంతో మంజు తీవ్ర గాయాలతో ప్రాణాలు వదిలాడు.
దారుణం.. భార్య మీద కోపంతో నాలుగేళ్ల కూతురి తల నరికి.. నది ఒడ్డున పాతిపెట్టిన తండ్రి...
మంజు మీద పులి దాడి చేయడానికి గమనించిన అతనితో వచ్చిన స్నేహితులు అక్కడి నుంచి భయంతో పరుగందుకున్నారు. పులి దాడి చేస్తున్న సమయంలో రక్షించమంటూ మంజు అరుపులు, కేకలు పెట్టాడు. అతని అరుపులు విన్న అటవీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అటవీ సిబ్బందిని చూసిన పులి.. మంజును దాడి చేయడం ఆపేసి అక్కడ నుంచి పారిపోయింది. అయితే అప్పటికే మంజు మృతి చెందాడు.
ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు బలయ్యాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వెనకాలే ఫుల్లు తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోవడంలేదని అందుకే ఈ దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంజు మృతికి నిరసనగా మైసూరు - చామరాజ నగర రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో గంటలసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటవీ ఉన్నత అధికారులు, పోలీసులు వారు రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి చేరుకుని.. నిరసన విరమించేలా ప్రయత్నం చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 15 లక్షల నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనుతిరిగారు.