దారుణం.. భార్య మీద కోపంతో నాలుగేళ్ల కూతురి తల నరికి.. నది ఒడ్డున పాతిపెట్టిన తండ్రి...
భార్యమీది కోపంతో ఓ భర్త కసాయి వాడిలా ప్రవర్తించాడు. నాలుగేళ్ల చిన్నారిని కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత శవాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు.
బీహార్ : భార్య మీది కోపంతో కన్నబిడ్డను అతిదారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. నాలుగేళ్ల కూతురిని అత్యంత కిరాతకంగా తలనరికి చంపాడు ఓ వ్యక్తి. భార్య మీది కోపంతో ఈ పని చేసి.. ఆ చిన్నారి మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు అన్ని చోట్లా వెతికారు. ఐదు రోజుల తర్వాత వారు అన్వేషణ చేస్తుండగానే.. చావు కబురు చల్లగా చెప్పుకొచ్చాడు ఆ కర్కోటకుడు. భార్య మీది కోపంతో కూతురి తల నరికేసానని చెప్పాడు. భార్య వంట చేయడం లేదని కోపం వచ్చిందని.. అందుకే కూతురి తల నరికేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
ఈ హృదయవిధారకమైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సరౌని గ్రామంలో రాజకుమార్ భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. అతడు మద్యానికి బానిస. ఓ రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికి రాజ్ కుమార్ భార్య ఇంకా వంట చేయలేదు. దీంతో రాజ్ కుమార్ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆమెను బాగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె గట్టిగా కేకలు పెడుతూ.. తప్పించుకోవడానికి పక్కింటికి పారిపోయింది.
మహారాష్ట్రలో ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డ స్కూటర్.. ఇద్దరు మృతి..
ఈ సమయంలో ఇంట్లో నాలుగేళ్ల కూతురు ఒంటరిగా ఉంది. మద్యం మత్తులో, కన్నూ, మిన్నూ కానని కోపంలో.. ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి భార్య మీద కోపాన్ని.. కూతురిపై చూపించాడు. ఆ చిన్నారి తలను నరికేశాడు. ఆ తర్వాత సోయిలోకి వచ్చిన రాజకుమార్.. చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లి ఊరి చివర ఉన్న నదిఒడ్డున పాతిపెట్టి ఇంటికి వచ్చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం పక్కింట్లో నుంచి ఇంటికి వచ్చిన భార్య.. చిన్నారి పోవడంతో.. ఆమె కోసం వెతికింది.
తనలాగే కూతురు కూడా భయంతో ఎక్కడికైనా పోయిందేమో అని బంధువుల ఇళ్లల్లో.. గ్రామంలోని అనేక చోట్ల వెతికింది. కానీ ఎక్కడ ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో ఐదు రోజుల తర్వాత రాజ్ కుమార్ తనంతట తానే అసలు విషయం చెప్పుకొచ్చాడు. కూతుర్ని చంపేసి ఊరు చివర పాతేశానని తెలిపాడు. అతని మాటలు విని షాక్కు గురైన తల్లి, బంధువులు వెంటనే అతను చెప్పిన చోటుకి వెళ్లి చూడగా బాలిక మృతదేహం దొరికింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత రాజకుమార్ ను హత్య నేరం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.