కేరళలో కలకలం:నిఫా వైరస్తో 12 ఏళ్ల బాలుడు మృతి
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్తో కోజికోడ్ లో 12 ఏళ్ల బాలుడు ఆదివారం నాడు మరణించాడు. ఈ నెల 1వ తేదీన ఆ బాలుడు ఆసుపత్రిలో చేరాడు. నిఫా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో నిఫా వైరస్ లక్షణాలతో 12 ఏళ్ల బాలుడు ఆదివారం నాడు ఉదయం మరణించాడు. నిఫా వైరస్ లక్షణాలతో ఆ బాలుడు కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆ బాలుడు ఇవాళ మరణించాడు.
చత్తమంగళం పంచాయితీలోని సూళ్లూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు ఈ నెల 1వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. బాలుడి నమూనాలను పుణె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఈ నమూనాలను పరీక్షించిన నిపుణులు నిఫాగా గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళను పంపింది. రాష్ట్రంలో మరోసారి నిఫా వైరస్ లక్షణాలతో బాలుడు ఆసుపత్రిలో చేరిన విషయం నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది.
నిఫా వైరస్ ఉన్న బాధితుడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారిని పరీక్షిస్తే నిఫా వైరస్ లక్షణాలు లేవని తేలింది. కానీ వారిని పరీక్షిస్తున్నామని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.
నాలుగు రోజుల క్రితం బాధితుడు ఆసుపత్రిలో చేరాడని మంత్రి వీణా జార్జ్ గుర్తు చేశారు. శనివారం నాడు బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. తాము శాంపిల్స్ టెస్టింగ్ కోసం పంపినట్టుగా మంత్రి తెలిపారు. కన్నూర్, మలప్పురం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.
మలప్పురం పరిసర గ్రామాల ప్రజలను ప్రభుత్వం అలెర్ట్ చేసింది. అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచి వారి నమూనాలను పంపుతున్నారు. 2018 నిఫా వైరస్ కేసులు కేరళలో వెలుగు చూశాయి. కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 17 మంది నిఫా వైరస్ కారణంగా మృతి చెందారు. 2019లో కోచి లో నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. గబ్బిలాలు, పందులు, జంతువుల నుండి మానవులకు నిఫా వైరస్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెప్పారు.