సుప్రీంకోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట: ఈసీకి ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కు ఊరట లభించింది. నిజమైన శివసేన విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఈసీని ఆదేశించింది సుప్రీంకోర్టు.ఈ విషయమై ఏక్ నాథ్ షిండే వర్గం సహా, ఉద్దవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.
న్యూఢిల్లీ: Supreme Court లో మహారాష్ట్ర మాజీ సీఎం Uddhav Thackeray వర్గానికి ఊరట లభించింది. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం Eknath Shindeవర్గం దాఖలు చేసిన పిటిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.
Shiv Sena గుర్తుపై ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య న్యాయపోరాటం సాగుతుంది. ఈ మేరకు ఇరు వర్గాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను గుర్తించాలని చేసిన వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.ఈ వ్యవహారాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం నాడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV Ramana నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. ఎన్నికైన రాజకీయ పార్టీని విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా అని ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన వర్గాన్ని ప్రశ్నించారు . అయితే ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదం కాదని షిండే వర్గం తరపు న్యాయవాది హరీష్ సాల్వే అభిప్రాయపడ్డారు.
గత మాసంలో శివసేన లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వైపు వెళ్లారు. ఈ తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు.