Dengue fever: డెంగ్యూ జ్వరాన్ని అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. అందుకే లక్షణాలుంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది..
Dengue fever: కేరళలో డెంగ్యూ జ్వరాల కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి కోవిడ్ కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా జ్వరాలతో హాస్పటల్లను చేరే వారి సంఖ్య కూడా విపరీంగా పెరుగుతోంది.
ముఖ్యంగా ఈ సీజన్ లో అంటువ్యాధులు దారుణంగా వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, వ్యాధిని మోసుకెళ్లే దోమల వ్యాప్తి, అపరిశుభ్రమైన పరిసరాలే దీనికి ప్రధాన కారణం. డెంగ్యూ సోకిన వారి పరిస్థితి ఒక్కోసారి విషమంగా మారే అవకాశం ఉంది. ఒక సారి సోకిన వారికి మళ్లీ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. డెంగ్యూ విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పు వైరల్ జ్వరాల వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ఒక్క రోజులోనే 12,000 మందికి పైగా రోగులు వైరల్ జ్వరానికి చికిత్స పొందుతున్నారని అంచనా..
తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. బహుశా మొత్తం కేసుల్లో 70 శాతం వరకు రాజధాని జిల్లాలోనే నమోదవుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఓ అధ్యయనంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తేలింది. డెంగ్యూ బాధితులందరికీ టైప్ 3 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
డెంగ్యూ లక్షణాలు: అకస్మాత్తుగా విపరీతంగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక భాగంలో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, ఛాతీ నొప్పి, ముఖంపై ఎర్రటి దద్దుర్లు, వికారం, వాంతులు. అయితే వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రతిరోజూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
డెంగ్యూ జ్వరంతో జాగ్రత్త...
ఏడిస్ ఈజిప్టి (Aedes aegypti)దోమలు నిలకడగా ఉండే పరిశుభ్రమైన, అపరిశుభ్రమైన నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ దోమ ద్వారానే డెంగ్యూ జ్వరం ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రారంభంలో ఈ వ్యాధి లక్షణం జ్వరం. అందుకే చాలా మంది దీన్ని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ వ్యాధి ముదిరితే రక్తస్రావం నుంచి వివిధ రకాల సమస్యలు మొదలవుతాయి. అందుకే దీనిని ముందుగానే గుర్తించడం చాలా అవసరం.
డెంగ్యూ వైరస్ సోకిన ఆడ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ విధంగా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకు జ్వరం వస్తుంది. ఇది దాదాపు ఎనిమిది నుంచి 12 రోజుల వరకు ఉంటుంది. ఇలా దీర్ఘకాలిక జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ జ్వరం 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు.
దారుణమైన తలనొప్పి, శరీరమంతా నొప్పి, వాంతులు, గ్రంధుల ఉబ్బరం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి నిర్ధారణ అయిన కొద్ది రోజుల్లోనే చాలా మంది కోలుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన అస్వస్థత కలుగుతుంది.
డెంగ్యూ జ్వరంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం...
డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ముందుగా మీరు చేయాల్సింది.. దోమల సంతానోత్పత్తి వాతావరణాన్ని తొలగించాలి. దానికోసం. ఆరు బయట నీరు నిల్వలేకుండా చూడాలి. అలాగే ఇంట్లో తాగునీటి పైన ఎప్పుడూ మూతలు పెట్టాలి. రాత్రి , ఉదయం వేలల్లో కిటికీలు తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే అవి ప్రధానంగా ఉదయం పూటే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ఉపయోగించని రాగ్ లు, పారవేసిన ప్లాస్టిక్ కంటైనర్ లు, నాశనం కాని వ్యర్థాలు, ఉపయోగించని టైర్లు, బకెట్ లు మొదలైన వాటిని చెత్తలో వేయండి. దోమ కాటును నివారించడానికి దోమ వికర్షకాలను ఉపయోగించండి. మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులనే ధరించండి.