క్రిస్మస్ వేళ అమెరికాలో విషాదం.. 31మందిని బలిగొన్న మంచు తుఫాను..
క్రిస్మస్ వేళ న్యూయార్క్లోని బఫెలోలో మంచు తుఫాను నగరాన్ని అతలాకుతలం చేసింది. అయితే, ఈ మంచు తుఫాను కారణంగా 31 మంది మృతి చెందారు.
న్యూయార్క్ : క్రిస్మస్ న్యూయార్క్ లోని బఫెలోలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలన్న వారి కోరికను మంచు తుఫాను అతలాకుతలం చేసింది. క్రిస్మస్ రోజైన ఆదివారం అమెరికన్లకు ప్రమాదాన్ని, కష్టాలను తెచ్చిపెట్టింది. తూర్పు యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన మంచు, బీభత్సమైన చలి పట్టుకుంది. మంచు, చలి కారణంగా కనీసం 31 మంది మరణించారు.
ఈ వాతావరణ మార్పుల వల్ల పశ్చిమ న్యూయార్క్లోని బఫెలోలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది, ఇక్కడ మంచు తుఫాను నగరాన్ని అతలాకుతలం చేసింది, అత్యవసర సేవలు కూడా అధిక ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. వార్ జోన్ ను తలపిస్తోందని, రోడ్ల పక్కన ఉన్న వాహనాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని.. బఫెలో స్థానికుడైన న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. అంతేకాదు, ఇక్కడ ఎనిమిది అడుగుల (2.4-మీటర్) మేర మంచు పేరుకుపోయింది. దీనికితోడు విద్యుత్ అంతరాయాలు ప్రాణాపాయ పరిస్థితులను కల్పించాయని అన్నారు.
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 18 మంది మృతి.. నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో 7 లక్షల మంది
హోచుల్ ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాణాంతక పరిస్థితులు ఇంకా పోలేదు. నివాసితులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిళ్లలో వారు ఉండాలి.. బైటికి రాకపోవడమే మంచిదని హెచ్చరించారు.అనేక తూర్పు రాష్ట్రాలలో 200,000 పై చిలుకు జనాలకు.. కరెంట్ లేని పరిస్థితులే క్రిస్మస్ ఉదయానికి స్వాగతం పలికాయి. ఈ పరిస్థితుల చూసి సెలవుల మీద వెళ్లిన చాలా మంది తమ ప్రయాణ గడువును పెంచారు. అయినప్పటికీ మంచు తుఫాను పరిస్థితులు, భయంకరమైన గాలులతో కూడిన ఐదు రోజుల తుఫాను సడలింపు సంకేతాలు కనిపించాయి.
ఈ విపరీతమైన వాతావరణం కారణంగా.. ఈ ప్రాంతంతో పాటు అమెరికాలోని 48 రాష్ట్రాలలో వీకెండ్ లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేలా చేసింది. దీని కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఇళ్లు మంచుతో కప్పబడడంతో.. సెలవులకు వచ్చిన వారు చిక్కుకుపోయారు. ఈ మంచు, తీవ్రమైన పరిస్థితుల కారణంగా..
తొమ్మిది రాష్ట్రాలలో ముప్పై ఒక్క మరణాలు నిర్ధారించబడ్డాయి. కొలరాడోలో నలుగురు, న్యూయార్క్ రాష్ట్రంలో కనీసం 12 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇంకాపెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇక బఫెలో ప్రాంతంలో ఈ మంచు కురవడం ఇప్పటివరకు.. ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనడం మొదటిసారని తేలింది. గంటల తరబడి మంచు కురవడంతో వాహానాల్లో ఉన్నవారు, మంచు దిబ్బలకింద కూరుకుపోయి కొంతమంది మృతదేహాలు దొరికాయి. ఎమర్జెన్సీ సిబ్బంది మంచులో కూరుకుపోయిన వారిని కాపాడడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. నగరం అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం వరకు మూసివేశారు. నది దిక్కు ఉన్న ఎరీ కౌంటీ మొత్తానికి డ్రైవింగ్ నిషేధించారు.
2022లో వచ్చిన ఈ మంచు తుఫాను గురించి భవిష్యత్తులో కూడా మాట్లాడుకుంటారు.. అని హోచుల్ చెప్పారు, దీని తీవ్రత.. 1977 నాటి మంచు తుఫానును మించిపోయిందన్నారు. మంచు తుఫాను కారణంగా విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇది మంగళవారానికి పునరుద్ధరింపబడవచ్చని ఒక అంచనా.. ఒక సబ్స్టేషన్ అయితే, 18 అడుగుల మంచుతో కప్పబడిందని సీనియర్ కౌంటీ అధికారి ఒకు తెలిపారు.
దారుణమైన పరిస్థితులు..
లేక్-ఎఫెక్ట్ స్నో కారణంగా పశ్చిమ న్యూయార్క్లోని గ్రేట్ లేక్స్ ప్రాంతంలో మంచు తుఫాను పరిస్థితులు ఆదివారం కూడా కొనసాగుతున్నాయని, "ఈ రాత్రి వరకు 2 నుండి 3 అడుగుల అదనపు మంచు పేరుకుపోతుంది" అని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.
కెనడా సరిహద్దులో ఉన్న బఫెలోలోని ఒక జంట, మంచు కారణంగా రోడ్డు అగ్యమగోచరంగా ఉండడంతో పది నిమిషాల దూరంలో ఉన్న తమ కుటుంబాన్ని చూడడానికి వెళ్లలేకపోయారు. "పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. అగ్నిమాపక విభాగాలు కాల్స్ కోసం ట్రక్కులను కూడా పంపడం లేదు" అని 40 ఏళ్ల రెబెక్కా బోర్టోలిన్ చెప్పారు.