అమెరికా విదేశీ విద్యార్థుల వీసాలపై కఠిన వైఖరి చేపట్టడంతో చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసా ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత.

అమెరికాలో విదేశీ విద్యార్థులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసే వారి ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించారు. తాజా మార్పుల్లో భాగంగా, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి వీసా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను ‘సోషల్ మీడియా వెట్టింగ్’గా పిలుస్తున్నారు. అంటే, దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాల ఆధారంగా వారి ఉద్దేశాలను అంచనా వేయనున్నారు.

ఇటువంటి పరిణామాలపై చైనా ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులను రక్షించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. విద్యారంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగాలని అభిప్రాయపడ్డారు.ఇక యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆయన ప్రకారం, పరిశోధన రంగాల్లో ఉన్న విద్యార్థులతో పాటు, చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న వారిపై వీసాల రద్దు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఇది చైనా విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారత్ తర్వాత అత్యధిక సంఖ్యలో చైనా విద్యార్థులున్నారు. అలాంటి సమయంలో వీరిపై అమెరికా తీసుకుంటున్న కఠిన వైఖరి విద్యారంగం పై ప్రభావం చూపించనుంది. ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడిన నేపథ్యంలో, త్వరలోనే మరింత కఠినమైన నియమాలు అమల్లోకి వచ్చే అవకాశముంది.