యూఎస్ సోషల్ మీడియా సెన్సార్ చేసే విదేశీ అధికారులపై వీసా నిషేధం విధించిన అమెరికా, తాము స్వేచ్ఛను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికలపై అమెరికన్ పౌరులు చేసిన పోస్టులు, కామెంట్లను తొలగించాలని ఒత్తిడి చేసే విదేశీ అధికారులపై అమెరికా ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలను ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులకు ఇకపై యూఎస్ వీసాలు ఇవ్వడం జరగదని ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విధానానికి సంబంధించి విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఇటీవలి కాలంలో కొన్ని దేశాల ప్రభుత్వాలు యూఎస్కు చెందిన సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. సోషల్ మీడియా సంస్థలపై తమకు అనుకూలంగా కంటెంట్ను తీసివేయాలని కొన్ని దేశాలు నోటీసులు జారీ చేయడం, కొన్ని చోట్ల అరెస్టు వారెంట్లు కూడా జారీ కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ, ఇతర దేశాల అధికారులు తమ హద్దులు దాటి అమెరికా పౌరుల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నించడం అనైతికమని తెలిపారు. అమెరికన్ పౌరులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తీకరించడాన్ని అడ్డుకోవడం, లేదా ఆ కంటెంట్ను తొలగించేందుకు టెక్ కంపెనీలపై ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు.
అంతర్జాతీయంగా ఎక్కువగా వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విటర్), ట్రూత్, బ్లూస్కై వంటి సామాజిక మాధ్యమాల యాజమాన్యం అమెరికాకు చెందినవే కావడంతో, ఈ సంస్థలపై ఇతర దేశాలు ప్రభావం చూపేలా ప్రయత్నించటం పట్ల అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది కేవలం అమెరికా పౌరుల వ్యక్తి స్వేచ్ఛను కాపాడటమే కాకుండా, యూఎస్కు చెందిన టెక్ సంస్థలపై విదేశీ ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యగా చెబుతున్నారు. అమెరికాలోని వ్యక్తులు తమ దేశం నుంచే సోషల్ మీడియాలో వ్యక్తపరిచే అభిప్రాయాలపై ఇతర దేశాల చట్టాలు వర్తించవని స్పష్టం చేసింది.
ఏ దేశాన్ని కూడా అమెరికా ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనకపోయినా, ఇటీవల పలు దేశాల నుంచి వచ్చిన చర్యల నేపథ్యంలో ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది.