భారత్, పాకిస్ధాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్తో మాట్లాడారు.
India Pakistan War : భారత్, పాక్ మధ్య యుద్దవాతావరణాన్ని చల్లబర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రంగంలోకి దిగారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కు రూబియ్ో ఫోన్ చేసి మాట్లాడినట్లు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది.
“విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి మార్గాలను కనుగొనాలని ఆయన ఇరు పక్షాలు (భారత్, పాక్) ను కోరారు. భవిష్యత్తు సంఘర్షణలను నివారించడానికి నిర్మాణాత్మక చర్చలు ప్రారంభించడంలో US సహాయం అందించేందుకు ముందుకొచ్చింది” పాకిస్థాన్ లో యూఎస్ ఎంబసీ ప్రకటించింది.
అంతకుముందు US వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని యూఎస్ భావిస్తోందని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్కో రూబియో ఇరు దేశాల నాయకులతో చర్చలు జరుపుతున్నారని లెవిట్ చెప్పారు. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని లెవిట్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణ చాలా పాతదని, ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
భారత్, పాక్ మధ్య ఉద్రక్తతలు :
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం క్రాస్ బోర్డర్ షెల్లింగ్ జరిపింది పాక్,.జమ్మూలోని రాజౌరి జిల్లాలో పౌర ప్రాంతాలపై భీకర కాల్పులు జరిపింది... దీంతో సరిహద్ద ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస పేలుళ్ల కారణంగా ఈ ప్రాంతంలోని అనేక ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి... చివరికి ప్రాాణాలు కూడా పోయాయి. ఓ అధికారితో సహా ఇద్దరు సామాన్యులు మరణించారు.
పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు, LoC వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయి... వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మెర్, భుజ్, క్యూర్బెట్, లఖి నాలా వంటి ప్రదేశాలకు డ్రోన్ ఎటాక్స్ కు పాక్ ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడులను తిప్పికొట్టింది.
ఫిరోజ్పూర్లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ దాడి చేసింది... దీంతో ఓ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించారు... భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రోన్ శిథిలాలను స్వాధీనం చేసుకున్నారు. భారత సాయుధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి, అన్ని వైమానిక ముప్పులను ట్రాక్ చేసి, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించి ఎదుర్కొంటున్నాయి.
పాకిస్తాన్ శనివారం భారతదేశంలోని 26 ప్రదేశాలపై దాడి చేసిన వెంటనే భారతదేశం ప్రతీకార దాడులు ప్రారంభించిందని ANIకి ఉన్నత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి అనేక ప్రదేశాలలో అడపాదడపా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని కనీసం నాలుగు వైమానిక స్థావరాలపై భారతీయ దాడులు జరిగాయని ఉన్నత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.