ఆఫ్ఘనిస్తాన్: కొత్త ప్రభుత్వంపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన
ఆఫ్గన్ పరిణామాలపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సోమవారం నాడు సమావేశమైంది. కొత్త ప్రభుత్వంపై కూడ కౌన్సిల్ సమావేశం సూచనలు చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా కొత్త ప్రభుత్వం వ్యవహరించకూడదని కోరింది.
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా ఓ సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచించింది.సోమవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చించింది. 15 సభ్యుల కౌన్సిల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ హింసను విడనాడాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానం కల్పించరాదని సూచించింది. తాము ఆఫ్ఘన్ ప్రజలను విడిచిపెట్టలేమని యూఎన్ఓ చీఫ్ గుటెర్రెస్ భద్రతా మండలికి చెప్పారు.
also read:ఆఫ్ఘనిస్తాన్ వాసులకు క్షమాభిక్ష: విధుల్లో చేరాలని అధికారులకు తాలిబన్ల ఆదేశం
ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండకుండా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను ఈ సమావేశం నొక్కి చెప్పింది. తాలిబన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘన్ సమూహం లేదా వ్యక్తి ఏ ఇతర దేశంలోని భూభాగంలోనూ పనిచేసే ఉగ్రవాదులకు మద్దతివ్వకూడదని కోరింది.
కొత్త ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలని కూడ సమావేశం సూచించింది.2001 సెప్టెంబర్ 11 వ తేదీన ఒసామా బిన్ లాడెన్ బృందం అమెరికాపై దాడికి దిగింది.ఆఫ్ఘనిస్తాన్ లోని 15 రాష్ట్రాల్లో ఆల్ఖైదా విస్తరించి ఉందని సెక్యూరిటీ కౌన్సిల్ కు స్వతంత్ర నిపుణుల కమిటీ గత మాసంలో నివేదిక ఇచ్చింది. ఇందులో ఆఫ్ఘన్, పాకిస్తాన్ జాతీయులున్నారని ఆ నివేదిక చెబుతుంది.