మార్పు సాధ్యమని నిరూపించాం, త్వరలోనే అణు నిరాయుధీకరణ: ట్రంప్
ట్రంప్, కిమ్ చర్చలు ఫలవంతం
సింగపూర్: త్వరలోనే అణు నిరాయుధీకరణ సాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో తన సమావేశం చారిత్రాత్మకమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు సింగపూర్ లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశమైన తర్వాత ఆయన సమావేశం వివరాలను మీడియాకు వివరించారు.
మార్పు సాధ్యమేనని తామిద్దరం కూడ నిరూపించినట్టుగా ఆయన చెప్పారు.ఉభయ కొరియా దేశాల ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవనం సాగించాల్సిన అవసరం ఉందన్నారు.
యుద్దం ఎవరైనా చేయవచ్చన్నారు. కానీ, సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియను చేపడతారని ఆయన చెప్పారు. తమ దేశంలో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వసం చేస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హమీ ఇచ్చారని ట్రంప్ గుర్తు చేశారు. నిన్నటి ఉద్రిక్తతలు రేపటి యుద్దానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితులు రాకూడదని ఆయన చెప్పారు.
తమ ఇద్దరి మధ్య చర్చ జరిగిన చర్చలు ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చాయని ఆయన చెప్పారు. మేమిద్దం సాహసికులం, అందుకే చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. భవిష్యత్ చర్చలపై వచ్చే వారంలో ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.