ఓవల్ ఆఫీస్ ఒకప్పుడు చారిత్రాత్మక ఒప్పందాలకు వేదిక. ఇప్పుడు టీవీ షో స్టూడియోలా మారింది. ట్రంప్, అతని అనుచరులకు వారి విధానాలు అమలు చేసే వేదికగా మారింది. తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫాసోను కూడా ట్రంప్ అవమానించారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి బాధితుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.. కానీ తాజాగా రామఫోస మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ట్రంప్ మాట్లాడింది విని వివరణ ఇవ్వడానికి, వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అమెరికా అధ్యక్షుడు అతడిమాట వినకుండా అరుస్తూ అవమానించారు.
ఒకప్పుడు దౌత్యం, మర్యాదలకు ప్రతీక అయిన వైట్ హౌస్ ఇప్పుడు రాజకీయ నాటకాల వేదికగా మారింది. కానీ ఈ ఆటలో తాను ఓడిపోతున్నానని అమెరికా అధ్యక్షుడికి తెలియడంలేదు. సమావేశం జరుగుతుండగానే ఫోటోలను బైటపెట్టాడు ట్రంప్ సలహాదారుడు జాసన్ మిల్లర్.
చారిత్రాత్మక ఒప్పందాలకు వేదిక అయిన ఓవల్ ఆఫీస్ ఇప్పుడు టీవీ షో స్టూడియోలా మారింది. రామఫోస సహకారం కోసం, వాణిజ్య చర్చల కోసం అమెరికా వెళ్లారు. ఆగిపోయిన సహాయం పునఃప్రారంభం అవుతుందని ఆశించారు. కానీ వైట్ హౌస్ వేరేదాని కోసం ఎదురు చూసింది. దక్షిణాఫ్రికాలో తెల్లవారిని చంపేస్తున్నారని.. ఈ హింసను ఎందుకు ఆపడం లేదని అమెరికా అధ్యక్షుడు ప్రశ్నించారు. దీన్ని రామఫోస ఖండించారు.. వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.
రామఫోసా మాట్లాడుతుండగానే కెమెరా ఆన్ అయింది. స్క్రీన్ మీద వీడియోలు… ట్రంప్ చేతిలో కాగితాలు, ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. స్క్రీన్ మీద దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ఉద్యమ కాలం నాటి వీడియోలు, నాయకుల ఉపన్యాసాలు, నినాదాలు, పాటలు వచ్చాయి. కానీ అందులో ఒకటి దక్షిణాఫ్రికాది కాదు, కాంగోది.
(వైట్ హౌస్లో ట్రంప్, రామఫోస సమావేశం)
ఇప్పుడు వాస్తవాలేమిటో చూద్దాం. దక్షిణాఫ్రికాలో తెల్లవారిని హత్యలు చేస్తున్నారనే ఆరోపణ వాస్తవమా?
ట్రంప్ ఆరోపణలు వాస్తమేనా?
దక్షిణాఫ్రికాలో రోజుకి 72 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది బాధితులు నల్లజాతీయులే. 2024లో 26,232 హత్యలు జరిగాయి. అందులో 44 మాత్రమే రైతులకు సంబంధించినవి... 8 మంది మాత్రమే తెల్లజాతి రైతులు. ఆఫ్రికాన్ రైతు సంఘం లెక్కల ప్రకారం 1990 నుంచి ఇప్పటి వరకు 1,363 మంది చనిపోయారు. వర్ణవివక్ష హత్యలు కేవలం ఊహాజనితమని కేప్టౌన్ కోర్టు కూడా తీర్పు చెప్పింది.
వర్ణవివక్ష కాలంలో దేశంలోని భూమి అంతా తెల్లవారి చేతుల్లో ఉండేది. ఇప్పటికీ ప్రైవేట్ భూమిలో మూడొంతులు వారిదే. ఈ అసమానత తొలగించడానికి ప్రభుత్వం చట్టం తెచ్చింది. తెల్లవారికి నష్టపరిహారం ఇచ్చి భూమి తీసుకుని నల్లజాతీయులకు పంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ అది జరగలేదు. ఆ తర్వాత భూమి అమ్మమని తెల్లవారిని ప్రోత్సహించారు… అది కూడా ఫలించలేదు. దీంతో రామఫోస ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే చట్టం తెచ్చింది. కానీ చట్టం ఇంకా అమలు కాలేదు.
(
(వైట్ హౌస్లో ట్రంప్, రామఫోస సమావేశం)
రామఫోస వృధాగా వెళ్లి విమర్శలు ఎదుర్కొన్నారని అంటున్నవారు కూడా ఒక విషయం ఒప్పుకుంటున్నారు. ప్రశాంతంగా, చిరునవ్వుతో ట్రంప్ను ఎదుర్కొన్న రామఫోసను మెచ్చుకోవాలి. జెలెన్స్కీకి అది సాధ్యం కాలేదు. కానీ ఇద్దరి పరిస్థితులు వేరు. ట్రంప్ విధానం ఎప్పుడూ ఒకటే. అవమానించి, ఆధిపత్యం చూపించడం. కానీ దీనివల్ల అమెరికా ప్రతిష్ట దెబ్బతింటోంది. కెనడా ప్రధానిని, జెలెన్స్కీని అవమానించడం ఉదాహరణ. అమెరికా దూరం చేసుకుంటే దక్షిణాఫ్రికా చైనాకు దగ్గరవుతుంది. ఈ విషయం ట్రంప్ గ్రహిస్తే మంచిది.