సింగపూర్లో ట్రంప్తో కిమ్ భేటీ: ఏం మాట్లాడుకొన్నారంటే?
కిమ్, ట్రంప్ భేటీపై ప్రపంచదేశాల ఆసక్తి
సింగపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ లు మంగళవారం నాడు సింగపూర్లో సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ లు సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. గత ఏడాదిలో అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలతో ప్రపంచదేశాలను కిమ్ భయాందోళనలకు గురి చేశారు.
అయితే ఈ ఏడాది జనవరి మొదటి రోజు నుండి కిమ్ జంగ్ ఉన్ శాంతి వచనాలను పాటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో శాంతి చర్చలకు సిద్దమని కూడ కిమ్ ప్రకటించారు. దీంతో ఈ రెండు దేశాలు చర్చలకు సంసిద్దతను వ్యక్తం చేశాయి.దీంతో మంగళవారం నాడు ట్రంప్, కిమ్ జంగ్ ఉన్ లు సింగపూర్ లోని కెపెల్లా హోటల్ లో సమావేశమయ్యారు.
48 నిమిషాల పాటు చర్చలు
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కెఫెల్లా హోటల్ లో సుమారు 48 గంటల పాటు చర్చలు జరిగాయి. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్ కిమ్కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది. మొదట ఏకాంత చర్చల అనంతరం ఇరుదేశాల దౌత్యనేతలతో అధ్యక్షులు సమావేశం అయ్యారు.
తొలుత స్నేహపూర్వకంగా కరచాలనం చేసిన ఇరువురు దేశాధినేతలు అనంతరం నవ్వుతూ కెమెరాకు ఫోజు ఇచ్చారు. సింగపూర్లోని సెంటోసా దీవి వేదికగా జరిగిన ఈ చరిత్రాత్మక భేటీలో తొలిసారి కలిసిన ట్రంప్-కిమ్ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తమ మధ్య చర్చలు విజయవంతం అవుతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది అని కిమ్ అన్నారు. కిమ్తో తన భేటీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నాకు ఎంతో గొప్పగా ఉంది. మన సమావేశం నిజంగా ఫలప్రదం కాబోతుందని నేను భావిస్తున్నాను. మన మధ్య అద్భుతమైన అనుబంధం నెలకొనబోతోంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదని ట్రంప్ కిమ్తో చెప్పారు.
ఇంతవరకు రావడం మామూలు విషయం కాదన్నారు కిమ్ . గతం మనముందు ఎన్నో అడ్డంకులు ఉంచింది. కానీ వాటన్నింటినీ అధిగమించి మనం ఈ రోజు ఇక్కడివరకు వచ్చామని ఆయన చెప్పారు. కిమ్తో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య అద్భుతమైన బంధం ఏర్పడబోతున్నదని పేర్కొన్నారు. తాము ఇరువురం పెద్ద సమస్యను పెద్ద సందిగ్ధాన్ని పరిష్కరించినట్టు చెప్పారు. కలిసి పనిచేస్తూ సమస్యలు పరిష్కరించకుంటామని ఆయన తెలిపారు.
అణు నిరాయుధీకరణ, శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు జరిగాయి. ఈ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకొన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇరువురి మధ్య సుహృధ్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ రెండు దేశాధినేతల మధ్య ఏ అంశాలపై చర్చలు జరిగాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
భారతీయ వంటకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మంగళవారం జరుగుతున్న కీలకమైన భేటీ వార్తల్ని ప్రపంచానికి అందించడానికి వివిధ దేశాల నుంచి తరలివచ్చిన 3 వేల మంది విలేకరుల కోసం పసందైన విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరు మూడు రోజులకు పైగా సింగపూర్లో ఉంటారు. భారతీయ వంటకాలైన పలావ్, కోడి కూర, కోడి కుర్మా, పప్పు, చేపల కూర, అప్పడం వంటివి కూడా వీరికి వడ్డించే పదార్థాల జాబితాలో చోటు చేసుకున్నాయి. మొత్తం 45 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు.
భారత్తో పాటు సింగపూర్, మలేసియా, వియత్నాం, థాయ్లాండ్, కొరియా, జపాన్, చైనా, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మధ్యప్రాచ్య దేశాలు... ఇలా 15 భిన్న ప్రాంతాల రుచుల్ని పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా సింగపూర్లో ప్రసిద్ధ వంటకాలైన లక్సా, చికెన్ రైస్ వంటిని అందించనున్నారు.
దాదాపు 7వేల భోజనాల కోసం 7 టన్నులకు పైగా వంటకాలను ఛాంగి విమానాశ్రయంలోని వంటశాలలో సిద్ధం చేస్తున్నారు. ఈ బృందంలో భారతీయ పాకశాస్త్ర నిపుణుడైన అమిత్ వర్మ కూడా ఉన్నారు.