పాకిస్థాన్ లో విషాదం.. గిల్గిత్-బాల్టిస్థాన్ లో హిమపాతం.. 10 మంది మృతి, 12 తీవ్ర మందికి గాయాలు
పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో హిమపాతం సంభవించడంతో 10 మంది మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం మంచుచరియలు విరిగిపడటంతో సంచార తెగకు చెందిన 10 మంది మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. పర్వత ప్రాంతంలోని అస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
చావులో సైతం వీడని స్నేహం.. స్నేహితుడి చనిపోయాడని, చితిలో దూకిన వ్యక్తి..
కాగా.. ఈ హిమమాతం సంభవించిన వెంటనే స్థానికుల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించామని, ఆ తర్వాత పాక్ ఆర్మీ సైనికులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. గుజ్జర్ కుటుంబానికి చెందిన 25 మంది తమ పశువులతో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అస్టోర్ కు వెళ్తుండగా హిమపాతం సంభవించినట్లు ‘డాన్’ న్యూస్ తెలిపింది.
ప్రమాదాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొహియుద్దీన్ వనీ ధృవీకరించారు. ప్రభావిత ప్రాంతంలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. గిల్గిత్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఖాన్ ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఇంటీరియర్ సెక్రటరీ, జీబీడీఎంఏ (గిల్గిట్ బాల్టిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులను ఆదేశించారు.
ఈ హిమపాతంలో ప్రాణ నష్టం జరగడంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ హానికరమైన ప్రభావాల నుండి రక్షించడానికి యావత్ ప్రపంచం తన బాధ్యతను నెరవేర్చాలని ఆయన అన్నారు.
కాగా.. 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న 14 ప్రపంచ శిఖరాలలో ఐదు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో పాటు ఈ గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 7,000 కంటే ఎక్కువ హిమానీనదాలు ఉన్నాయి. దీంతో తరచుగా హిమపాతాలు, కొండచరియలు విరిగిపడుతుంటాయి. హిమనదీయ సరస్సు విస్ఫోటనాలు జరుగుతుంటాయి. 2012లో స్కర్దు జిల్లాకు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలోని గయారీ ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 129 మంది పాక్ ఆర్మీ జవాన్లు, 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.