పాకిస్తాన్ పీఎం షాబాజ్ షరీఫ్ మంగళవారం ఇస్లామాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యుద్ధం తమకు ఒక ఆప్షన్ కాదని పేర్కొన్నారు. అయితే.. అదే తరుణంలో దేవుడా.. మంచిదైంది పాక్ ఒక అణుశక్తి అని వివరించారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మంగళవారం అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన పాకిస్తాన్ ఒక అణుశక్తి అని గుర్తు చేయడం గమనార్హం. అదీ.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దు గురించి మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ పీఎం షరీఫ్ న్యూక్లియర్ పవర్‌ను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

యుద్ధం ఒక ఆప్షన్‌గా తాము భావించడం లేదని అంటూనే ఆయన న్యూక్లియర్ గురించి మాట్లాడారు. ఇస్లామాబాద్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేవుడా.. పాకిస్తాన్ ఒక అణుశక్తిగా ఉండటం మంచిదైంది. దాడి చేయడానికి కాదు, రక్షణ కోసమే’ అని అన్నారు. ఈ విషయంలో విభేదాలు రాకుండా దేవుడు కాపాడుతాడని వివరించారు. అదే జరిగితే.. ఇక్కడ ఏం జరిగిందో చెప్పడానికైనా ఎవరైనా మిగులుతారా? అంటూ అడిగారు. కాబట్టి, యుద్ధం అనేది తమ ఆప్షన్‌లో లేదని చెప్పారు.

Also Read: మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి జైలు నుంచి విముక్తి.. క్షమాభిక్ష ప్రసాదించిన జుంటా..

మన పొరుగు దేశం సీరియస్ విషయాల్లో సీరియస్‌గా ఉన్నదని, తాము దానితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా ఇండియాను పేర్కొంటూ పాక్ పీఎం షరీఫ్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న అసాధారణాలను తొలగించుకోవాలని, అప్పటి వరకు చాలా సీరియస్ విషయాలను అర్థం చేసుకోలేమని, వాటిని చర్చించడం కూడా సాధ్యపడకపోచ్చని వివరించారు.