ఆర్మీకి వయాగ్రాలు ఇస్తున్నది.. రష్యా యుద్ధ వ్యూహం లైంగికదాడులే: ఐరాస తీవ్ర ఆరోపణలు
ఉక్రెయిన్ పౌరులపై లైంగిక నేరాలకు పాల్పడాలని రష్యా తన ఆర్మీకి వయాగ్రాలు ఇస్తున్నదని ఐరాస ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వార ఉక్రెయిన్లో ప్రజలపై ఆర్మీ లైంగికదాడులకు పాల్పడుతున్నదని, ఇది రష్యా యుద్ధ వ్యూహంలో భాగమేనని ఓ మీడియా ఔట్లెట్ పే్కొంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా ‘సైనిక చర్య’ను ప్రారంభించింది. భౌగోళిక ప్రాంతాలకు ముప్పు పేరిట ఈ దాడులు మొదలయ్యాయి. రష్యా సైన్యం నేరుగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. ఈ యుద్ధంలో అనేక భయంకర చిత్రాలను చూడాల్సి వచ్చింది. రష్యా వెనక్కి తగ్గడం లేదు.. అలాగని పశ్చిమ దేశాల మద్దతు చూసుకుని ఉక్రెయిన్ కూడా వెనుకడుగు వేయడం లేదు. ఈ తరుణంలో తాజాగా, ఐరాస ప్రతినిధి ప్రమిలా ప్యాటన్ రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు. రేప్లు, లైంగిక వేధింపులు, దాడులను రష్యా ఒక యుద్ధ వ్యూహంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. ఆర్మీకి ఆ దేశం వయాగ్రాలు ఇస్తున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏఎఫ్పీకి ఇచ్చిన ఇంటర్వ్యూల ప్యాటన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ యుద్ధంలో లైంగిక నేరాలు కూడా జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా ప్యాటన్ పై వ్యాఖ్యలు చేశారు. రష్యా సోల్జర్లు వయాగ్రా వంటి డ్రగ్స్ ఇచ్చి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల నుంచి కూడా అనేక వాంగ్మూలాలు ఈ విషయాన్నీ రూఢీ చేస్తున్నాయని వివరించారు.
‘మహిళలను కొన్ని రోజుల పాటు నిర్బంధించడం, చిన్న పిల్లలు మొదలు పురుషుల వరకు రేప్లకు గురువుతున్నప్పుడు, జననాంగాలను కత్తిరిస్తున్న ఘటనలు ఉన్నప్పుడు, రష్యా ఆర్మీ వయాగ్రాలను వెంట బెట్టుకుని వస్తున్నారని ఉక్రెయిన్ మహిళలు చెప్పినప్పుడు... పై విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది స్పష్టంగా రష్యా మిలిటరీ స్ట్రాటజీనే’ అని ప్యాటన్ పేర్కొన్నారు.
‘రేప్ చేస్తుండగా వారు మాట్లాడుతున్న విషయాలను బాధితులు రిపోర్ట్ చేసినప్పుడు.. మరో విషయం స్పష్టం అవుతుంది. ఇది కచ్చితంగా బాధితులను మరింత అవమానించడమే’ అని తెలిపారు.
యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్ పౌరులపై లైంగిక దాడులకు పాల్పడిన సుమారు 100 ఘటనలపై యూఎన్ రిపోర్టును ప్యాటన్ ప్రస్తావించారు.
‘ఫిబ్రవరిలో రష్యా ఈ మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి వందకు మించిన రేప్ లేదా లైంగిక దాడుల ఘటనలను ఉక్రెయిన్లో వెరిఫై చేశాం. ఇవి రష్యా సైనికులు ఉక్రెయిన్ ప్రజలపై నేరాలకు పాల్పడినట్టు ధ్రువీకరిస్తున్నాయి. ఈ దారుణాలకు గురైనవారి వయసు నాలుగేళ్ల నుంచి 82 ఏళ్ల వరకు ఉన్నది’ అని ఆయన వివరించారు.