పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి అర్ధరాత్రి 2:30 కి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఫోన్ చేసి భారత దాడుల గురించి చెప్పారట.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ ఆపరేషన్ తర్వాత రెండు దేశాల మధ్య మిస్సైల్ దాడులు, డ్రోన్ చర్యలు జరగడం గమనార్హం.పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా చేసిన ప్రకటనలతో ఈ ఘటనలపై మరింత స్పష్టత వచ్చింది. మే 9 నుండి 10 మధ్య రాత్రి 2:30 సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తనకు సెక్యూర్ లైన్‌లో ఫోన్ చేసి, భారత వాయుసేన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసిందని చెప్పారని షరీఫ్ వెల్లడించారు.

దీనికి ప్రతిగా పాకిస్తాన్ వాయుసేన దేశ రక్షణ కోసం తక్షణమే స్పందించి, స్వదేశీ టెక్నాలజీతో పాటు చైనా యుద్ధ విమానాల సహాయంతో దాడిని తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ సైన్యం భారత్‌ను ఎటువంటి విధంగా ఎదుర్కొన్నదన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని షరీఫ్ తెలిపారు. పఠాన్‌కోట్, ఉధంపూర్ వంటి ప్రాంతాల్లో పాక్ సైన్యం లక్ష్యంగా దాడులు చేసి, భారత సైన్యాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని చెప్పారు.

ఇటువంటి పరిణామాల నడుమ భారత్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని ప్రతిపాదించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను స్విమ్మింగ్ చేస్తుండగా ఈ సమాచారం తెలిసిందని, మునీర్ ఫోన్‌లో తన అభిప్రాయం కోరినప్పుడు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాలని సూచించానని వెల్లడించారు.

ఈ పరిణామాలతో దక్షిణాసియా పరిసరాల్లో మరోసారి సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటివరకు అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికాలేదు కానీ, రెండు దేశాల మధ్య తలెత్తిన ఈ సంఘటనలతో పరిసర దేశాలు, అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.