వరదలతో పాకిస్థాన్ అతలాకుతలం.. కలుషిత నీటితో ప్రబలుతున్న వ్యాధులు.. సింధ్ లో 90 వేల డయేరియా కేసులు..
వరదల వల్ల అతలాకుతలం అయిన పాకిస్థాన్ లో నీటి సంబంధిత వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఒక్క సింధ్ ప్రావిన్స్ లోనే గడిచిన 24 గంటల్లో 90 వేలకు పైగా డయేరియా కేసులు నమోదు అయ్యాయి.
వరదలతో పాకిస్థాన్ అతలాకుతలం అయ్యింది. ఈ విపత్తు వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. అయితే ఈ వరదల వల్ల తాగు నీరు కూడా కలుషితంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఈ కలుషిత నీటి ద్వారా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు గురువారం ధృవీకరించారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో డయేరియా, చర్మవ్యాధులు, కంటి ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత 24 గంటల్లో అత్యంత దెబ్బతిన్న ప్రావిన్స్లలో ఒకటైన సింధ్లో 90,000 పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి.
వరద బాధితుల్లో కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ నివేదికలు వెలువడ్డాయి. అసాధారణంగా ప్రారంభమైన భారీ రుతుపవన వర్షాలు, వాతావరణ మార్పుల వల్లే ఇవి సంభవించాయని పాకిస్తాన్ పేర్కొంది. జూన్ నుండి పాకిస్థాన్ లో ఏర్పడ్డ వరదల కారణంగా 1,191 మంది మరణించారు. 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు ఒక మిలియన్ ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
అయితే ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని అనేక జిల్లాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. దాదాపు లక్షన్నర మంది వరదల కారణంగా నిరాశ్రయులు సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్లో బాధితులకు చికిత్స చేయడానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో వేల సంఖ్యలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రావిన్షియల్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అజ్రా ఫజల్ పెచుహో తెలిపారు. మొబైల్ మెడికల్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రమైన డయేరియా, కలరా, ఇతర అంటువ్యాధుల కోసం నిఘాను పెంచుతోంది. వీటిని అరికట్టేందుకు కావాల్సిన సామాగ్రిని అందిస్తోంది.
మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్ల దగ్గరికి వచ్చే బాధితులకు వరదల వల్ల కలిగిన గాయాలే కనిపించేవి. కానీ ఇప్పుడు డయేరియా, చర్మవ్యాధులు, ఇతర నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వేలాది మందికి చికిత్స అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా ప్రమాదాలకు గురయ్యారు.
యూఎన్ పాపులేషన్ ఫండ్ ప్రకారం.. పాకిస్తాన్లోని 6.4 మిలియన్ల వరద బాధితులకు మానవతా సహాయం అవసరం ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 650,000 మంది గర్భిణీ స్త్రీలు, వచ్చే నెలలో ప్రసవాలు అయ్యే అవకాశం ఉన్న 73,000 మందికి ప్రసూతి ఆరోగ్య సేవలు అవసరమని పేర్కొంది.
గర్భిణి అయిన భారత పర్యాటకురాలి మృతి.. రాజీనామా చేసిన పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి
కాగా.. సైన్యం మద్దతు, ఇతర సిబ్బంది వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. వీరంతా ఎక్కువగా పడవలను ఉపయోగిస్తున్నారు. వంతెనలు, ధ్వంసమైన రోడ్డు ప్రాంతాల్లో ఒంటరిగా చిక్కుకున్న ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కొన్నిరోజుల కిందట తమ దేశానికి 160 మిలియన్ల డాలర్ల అత్యవసర నిధుల అందించాలని ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ అప్పీల్ చేసింది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ గురువారం ఓ ట్వీట్ లో.. తమ దేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి విడత 50 మిలియన్ల డాలర్ల విలువైన సహాయక వస్తువులను పంపిణీ చేసిందని తెలిపారు. అలాగే అమెరికా 30 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిందని పేర్కొన్నారు. ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు, టర్కీ, చైనా, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు అనేక దేశాలు పాకిస్తాన్లోని వరద బాధితులకు సాయం అందించాయి.