భారత్‌పై డ్రోన్ దాడుల యత్నాల నడుమ పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. 4.0 తీవ్రతతో క్వెట్టా సమీపంలో ప్రకంపనలు రాత్రి 1:44కి సంభవించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

భారతదేశంపై డ్రోన్ ద్వారా దాడులు జరిపేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో మే 9 అర్ధరాత్రి ఆకస్మాత్తుగా భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు శనివారం తెల్లవారుజామున 1:44 గంటలకు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్ ప్రకారం భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది.బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరానికి సమీపంలో భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఇది మామూలు సంఘటనే అయినా, ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల్లో ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. రాత్రి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భూకంపం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, జనాల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, కొంతసేపు పాక్ ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.ఇక భూకంపానికి కొద్దిసేపటి ముందే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు ప్రణాళిక వేసిందని భారత ఆర్మీ సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. ఇటీవలే ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో, భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

దీంతో స్పందనగా పాకిస్తాన్ డ్రోన్లతో పౌర ప్రాంతాలపై దాడులకు యత్నిస్తోంది. అయితే, భారత్ సైన్యం ప్రతి సారి అప్రమత్తంగా స్పందిస్తూ తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య భూకంపం సంభవించడం పాక్‌లోని పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసింది.