రాత్రి 8 గంటల తర్వాత పిల్లలను కనలేం.. మార్కెట్లకు జనాభా నియంత్రణకు లింక్ పెట్టిన పాక్ మంత్రి.. నెట్టింట వైరల్
పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖావాజా ముహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 8 గంటలలోపే మార్కెట్లు మూసేసే దేశాల్లో జనాభా పెరగడం లేదని చెప్పారు. ఈ జనాభా నియంత్రణ థియరీ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ముహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కామెంట్ల వరద వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కామెంట్లు విసిరి మంత్రిపై ట్రోల్స్ చేశారు. జనాభా నియంత్రణకు ఆయన చెప్పిన థియరీ అలాంటిది మరీ. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?
దేశంలో సహజ వనరుల సంరక్షణ, ఇంధన వినియోగ నియంత్రణ గురించిన ప్లాన్లను వెల్లడించడానికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖావాజా ముహమ్మద్ ఆసిఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ‘మార్కెట్లు 8 గంటలకే మార్కెట్లు మూసేస్తున్న దేశాల్లో జనాభా పెరుగుదల లేదు’ అని ఆయన చెప్పారు. రాత్రి 8 గంటల తర్వాత పిల్లలను కనలేమన్న కొత్త అధ్యయనం వచ్చింది అనే క్యాప్షన్తో నైలా ఇనాయత్ అనే ట్విట్టర్ హ్యాండిల్ మంత్రి వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. ఆయన ఈ విచిత్ర థియరీపై విమర్శలు, జోకులు పేలుస్తూనే మరో పాయింట్ను నెటిజన్లు రెయిజ్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ ఈ కామెంట్ చేస్తుండగా.. ఆయన పక్కనే కూర్చున్న పర్యావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహమాన్ ముఖంలో రియాక్షన్నూ చాలా మంది పాయింట్ చేశారు.
రక్షణ మంత్రి ఈ కామెంట్ చేయగానే.. అనుకోకుండానే రెహమాన్ ముఖం తిప్పుకున్నారు. ఆమె తన వస్తువులను దగ్గర పెట్టుకుని ఇక అక్కడి నుంచి లేచిపోదామన్నట్టుగా అన్ని సర్దుకుంటుండటం వీడియోలో కనిపించింది.
నెటిజన్లు అయితే.. రకరకాల కామెంట్లతో డిఫెన్స్ మినిస్టర్ పై కామెంట్లు పెడుతున్నారు.
ఇంధన పరిరక్షణ ప్రణాళికల గురించి ఆయన మాట్లాడుతూ, వెడ్డింగ్ హాల్స్ రాత్రి పది గంటలలోపు పూర్తి చేయాలని, 8.30 గంటలే మార్కెట్లు మూసేయాలని అన్నారు. తద్వారా దేశానికి రూ. 60 బిలియన్ల సహకారం చేసినవారు అవుతారని తెలిపారు.