ఆపరేషన్ సింధూర్ లో ఓటమి తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ కి ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చారు. ఈ హోదా పొందిన రెండో వ్యక్తి మునీర్.

Islamabad : సాధారణంగా ఏ దేశంలోనైనా సైన్యాధిపతులకి గెలిచిన యుద్ధాలు, సైనిక కార్యకలాపాలకి ప్రభుత్వం పతకాలు ఇస్తుంది. వాటిని సైన్యాధిపతులు గర్వంగా ధరిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఎన్ని కార్యకలాపాలు, యుద్ధాలు ఓడిపోయారో చూసి పతకాలు ఇస్తారని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే పాకిస్తాన్ లో ప్రభుత్వానికి, సైన్యానికి గౌరవం లేదు. 

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ అంతటా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. కానీ దీని గురించి అబద్ధాల ప్రచారం చేసుకున్న పాక్ ఇప్పుడు మరో దిగజారుడు చర్యకి పాల్పడింది. పాకిస్తాన్ సీడీఎస్ అసీం మునీర్ ని ఫీల్డ్ మార్షల్ గా ప్రమోట్ చేశారు.

ఒక్క యుద్ధం కూడా గెలవకుండా, సైనిక కార్యకలాపాల్లో సఫలం కాకుండా ఫీల్డ్ మార్షల్ అయిన మొదటి వ్యక్తి ఇతనే. అయూబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో వ్యక్తి అసీం మునీర్.

ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై బాంబు దాడి చేసింది. 12 వైమానిక స్థావరాలపై బాంబు దాడి, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థని జామ్ చేయడమే కాకుండా, లాహోర్ కి డ్రోన్ పంపి ధ్వంసం చేసింది.

ప్రతీకార దాడిలో పాకిస్తాన్ వాడిన చైనా, టర్కీ డ్రోన్లని భారత్ సులభంగా కూల్చివేసింది. 5-7 యుద్ధ విమానాలు పాకిస్తాన్ కోల్పోయింది. 800 నుండి 1000 డ్రోన్లు భారత సరిహద్దులో వైమానిక రక్షణ వ్యవస్థ దాటలేక కూలిపోయాయి. 70 మందికి పైగా సైనికులు చనిపోయారని సమాచారం. ఎన్ని సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయో పాక్ ఇంకా లెక్కేయలేకపోతోంది. ఇంత జరిగినా చివరికి భారత డీజీఎంఓ కి లొంగి యుద్ధ విరమణ కోరింది.

ఇంత అవమానం జరిగినా అసీం మునీర్ కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ హోదా చాలా అరుదు. చివరిసారిగా 1959 లో జనరల్ అయూబ్ ఖాన్ కి ఇచ్చారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత గౌరవం.

జనరల్ అసీం మునీర్ 2022 నవంబర్ లో జనరల్ కమర్ జావేద్ బజ్వా నుండి సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 నవంబర్ లో ముగియనున్న ఆయన సైన్యాధిపతి పదవీకాలాన్ని మూడేళ్ల నుండి ఐదేళ్లకి పొడిగించారు.