Breaking: పాకిస్తాన్ ఎన్నికల్లో మాదే విజయం: నవాజ్ షరీఫ్.. మెజార్టీ లేకున్నా మాదే ప్రభుత్వం అని ప్రకటన
పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించింది. తమ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని నవాజ్ షరీఫ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
![nawaz sharif claims victory in pakistan national elections as counting underway kms nawaz sharif claims victory in pakistan national elections as counting underway kms](https://static-ai.asianetnews.com/images/01hp779j9ckm59q248gs4x6q0g/nawaz-sharif_363x203xt.jpg)
Pakistan: పాకిస్తాన్ నేషనల్ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ గెలిచినట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం ఓట్ల కౌంటింగ్ జరిగింది. ఇందులో తమ పార్టీ గెలిచిందని నవాజ్ షరీఫ్ మీడియాకు తెలిపారు. పీఎంఎల్-ఎన్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని చెప్పారు. తమ పార్టీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు జరుపుతారని వివరించారు. అయితే.. ఆయన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకున్నదన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరికొన్ని సీట్లలో విజేతలు ఇంకా తేలాల్సి ఉన్నది. ఎలక్షన్ ప్యానెల్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) 61 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాలి. ఈ సంఖ్య మాత్రం ఇంకా చాలా తక్కువే ఉన్నది.
Also Read: తాతకు భారత రత్న.. బీజేపీతో పొత్తు ఆఫర్ను కాదనలేను: ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి
ఈ నేపథ్యంలోనే షరీఫ్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఒంటరిగా మెజార్టీ సీట్లు గెలుచుకోదని స్పష్టం చేశారు. తమ డిప్యూటీలు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెడతారని వివరించారు. మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారి పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతోనూ చర్చిస్తామని తెలిపారు. తద్వార సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు.