దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షహీద్ రాజయీ పోర్టులో శనివారం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం 115 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.  

ఇరాన్, అమెరికాల మధ్య ఒమన్‌లో మూడో విడత అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు జరిగడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంట‌న్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ప్ర‌స్తుతం గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. 

ఈ విష‌య‌మై స్థానిక విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారి మాట్లాడుతూ.. "ఈ ఘటన షహీద్ రాజయీ పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో జరిగింది. ప్రస్తుతం మేము గాయపడ్డవారిని వైద్య కేంద్రాలకు తరలిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. 

అధికారిక వార్తా సంస్థ త‌స్నీమ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. భారీగా మంటలు చెలరేగిన కారణంగా పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గాయపడినవాళ్లతో పాటు మ‌ర‌ణించే వారి సంఖ్య పెరుగుతుండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

పేలుడు తీవ్రతతో పలు కిలోమీటర్ల పరిధిలో గల భవనాల గాజు కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుడుకి సంబంధించిన వీడియోల్లో పెద్ద ఎత్తున పొగ ఆకాశాన్ని క‌మ్ముకోవ‌డం క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇది ప్ర‌మాదమా.? లేదా ఎవ‌రైనా దాడి చేశారా.? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.