కామెరూన్ లో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది దుర్మరణం..
కామెరూన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఇది సంభవించింది.
కామెరూన్ రాజధాని యౌండేలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మరణించారు. వీరంతా ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైనవారే. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ కామెరూన్ సెంటర్ రీజియన్ గవర్నర్ నసేరి పాల్ బీ ధృవీకరించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు.
ఘటనా స్థలం నుంచి గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం యౌండేలో అంత్యక్రియలకు హాజరైన వారిపై కొండచరియలు విరిగిపడ్డయని, ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను సెంట్రల్ హాస్పిటల్ మార్చురీకి తీసుకుళ్తున్నామని అన్నారు. ఈ ఘటనలో ఇంకా మరణించిన, తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
20 మీటర్ల ఎత్తైన కొండచరియలు ఉన్న ప్రాంతంలో అనేక మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారని, ఇది వారి పైన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు ‘రాయిటర్స్’ కు తెలిపారు. యౌండే ఆఫ్రికాలోని అత్యంత తేమతో కూడిన నగరాలలో ఒకటి. ఈ ప్రాంతంలో నిటారుగా అనేక కొండచరియలు ఉంటాయి. వాటి కింద గుడిసెలు వేసుకొని ప్రజలు నివసిస్తుంటారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బలహీనపడ్డాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.