Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ, అవినీతి, నోట్ల రద్దుపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా మైక్‌లు కట్ చేశారు.. : రాహుల్ గాంధీ

New Delhi: క‌న్యాకుమారి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అవినీతి, జీఎస్టీ అంశాన్ని లేవనెత్తుతూ లోక్‌సభలో తాను మాట్లాడుతుంటే మైక్ స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపించారు.
 

Mikes were cut whenever I tried to speak on GST, corruption and demonetisation: Rahul Gandhi
Author
First Published Nov 28, 2022, 3:27 AM IST

Rahul Gandhi - Bharat Jodo Yatra: త‌మిళ‌నాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 81వ రోజుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అవినీతి, జీఎస్టీ అంశాన్ని లేవనెత్తుతూ లోక్‌సభలో తాను మాట్లాడుతుంటే మైక్ స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపించారు. ఇండోర్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ప్రయాణంలో మేం ఒంటరిగా వెళ్లడం లేదనీ, యావత్ భారతదేశం మాతో ముందుకు క‌దులుతోంద‌ని అన్నారు. దేశ ప్రజలంతా మా వెంట నడుస్తున్నారని చెప్పారు. ఇండోర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన ఆయ‌న‌.. ఈ రోజు ఎనిమిది గంటలు నడిచాననీ, కానీ అక్కడ చెత్త కనిపించలేదని అన్నారు. ఇందుకు ఇండోర్ ప్రజలకు, స్వీపర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. 

"ఇండోర్, ఇక్క‌డి ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను.. మీరు 6 సార్లు స్వచ్ఛత అవార్డును గెలుచుకున్నారు. ఇక్క‌డివారు నాకు సోదరభావం నేర్పారు.. ఈ రోడ్లపై హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, అందరూ కలిసి నడిచారు. ఈ ప్రయాణం ఒక విధంగా భారతదేశ భావజాల ప్రయాణం" అని రాహుల్ గాంధీ అన్నారు.  అలాగే, తాను దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర‌, స్వ‌యంగా ప్ర‌జ‌ల‌ను ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింద‌నే దాని గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. లోక్‌సభలో మన గొంతు వినిపించకపోవడమే భారత్ జోడో యాత్రకు ప్రధాన కారణమని రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభలో అనేకసార్లు సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించామని చెప్పారు. రైతుల రుణమాఫీ లేదా ఇతర సమస్యలపై మాట్లాడితే మాయమాటలతో త‌మ మైక్‌ల‌ను ఆఫ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

 

"డీమోనిటైజేషన్, జీఎస్టీ అట్టడుగు వర్గాలను నాశనం చేశాయి" అని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో రైతులు, కూలీలు, యువత, చిన్న దుకాణాదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఇద్దరే లబ్ది పొందారని, వీళ్లకే పగ్గాలు కట్టబెట్టారని ఆరోపిస్తూ.. బీజేపీ, వారి సంబంధికుల‌ను టార్గెట్ చేశారు. చైనా సైన్యం దేశానికి చేయలేని నష్టం కేవలం డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్లే జరిగిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇద్దరు మిత్రులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందని రాహుల్ ఆరోపించారు.  చిరు వ్యాపారుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల చిరు వ్యాపారుల నగదు చలామణి ఆగిపోయిందన్నారు. ఈ విధానాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయ‌నీ, దీని కారణంగా వారి వ్యాపారాలన్నీ మూత‌ప‌డ్డాయ‌ని అన్నారు. ఈ దేశంలోని యువతకు ఉపాధి కల్పించని వరకు ఈ మధ్యతరగతి ప్రజలు బతకలేరన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios