గాజాలో అంతర్జాతీయ ప్రతినిధి బృందంపై కాల్పులు జరిగాయి. అయితే ఇలా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.   

గాజాలో అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే దారిలో ప్రతినిధుల బృందం ప్రయాణించడంతో హెచ్చరికగా కాల్పులు జరిపామని తెలిపింది.

ఇదిలాఉంటే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. కానీ ఆ విజయం సాధించే మార్గం రోజురోజుకూ క్రూరంగా మారుతోంది. ఇటీవల కేవలం ఒకే నెలలో ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3340 మంది అమాయకులు మరణించారు. లక్షలాది మంది పిల్లలు ఆహారం, నీరు లేక మరణాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి విమర్శించినా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు.

కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు తీవ్రంగా విమర్శించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోల సంయుక్త ప్రకటనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పరిమితంగా ఆహార పదార్థాలను అనుమతిస్తామని ఇజ్రాయెల్ చెప్పినా అది కూడా జరగలేదు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఉత్తర గాజాలోని ఆసుపత్రుల పనితీరు పూర్తిగా స్తంభించింది. ఖతార్ సమక్షంలో దోహాలో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, అవి ఎక్కడా ముగియలేదు.