ఇజ్రాయెల్ గాజాపై దాడులు మళ్లీ ఉధృతం చేయడంతో, హమాస్‌ గాజా పాలన నుంచి తప్పుకోవాలని నెతన్యాహు డిమాండ్ చేశారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా గాజా గురించి చేసిన కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. హమాస్‌తో సాగుతున్న యుద్ధం నేపథ్యంలో, గాజా పర్యవేక్షణను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ యుద్ధం తీవ్రంగా సాగుతోందని, అందులో తాము పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, విజయం సాధించాలంటే నిరంతరంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నెతన్యాహు టెలిగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.

వైమానిక దాడులు మళ్లీ తీవ్రంగా..

ఇటీవల గాజాలో వైమానిక దాడులు మళ్లీ తీవ్రంగా జరిగాయి. శనివారం అర్థరాత్రి జరిగిన బాంబుల వర్షంతో ఖాన్‌ యూనిస్, జబాలియాలోని శరణార్థుల శిబిరాలు సహా పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానిక ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. ఖాన్‌ యూనిస్‌లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలో 26 మంది మృతి చెందారు. మొత్తం 103 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒప్పందాన్ని విస్మరించడంతోనే..

హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించడంతోనే ఈ దాడులు మరింత ఉద్ధృతమయ్యాయని నెతన్యాహు ఇటీవల వెల్లడించారు. తాజా పరిణామాల్లో భాగంగా, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రెండవ అతిపెద్ద నగరం ఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయాలంటూ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతాన్ని ప్రమాదకరమైన  ప్రాంతంగా ప్రకటించింది.

ఇక దోహాలో కొనసాగుతున్న చర్చల్లో హమాస్ భవిష్యత్తు కూడా ప్రధానాంశంగా మారింది. గాజాలో శాంతి చేకూరాలంటే, హమాస్ పాలన నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ను ఇజ్రాయెల్ అధికారికంగా ముందుకు తెచ్చింది. ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుందని, ఉగ్రవాదుల్ని ఇతర దేశాలకు తరలించాలని ఇజ్రాయెల్‌ సూచించింది. కానీ, గాజా విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని, ఆయుధాలను విడిచిపెట్టేందుకు సిద్ధం కాదని హమాస్ వర్గాలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.

ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గాజా సమస్యపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గాజాను స్వేచ్ఛా మండలంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకు ఉందని తెలిపారు. ఇప్పటికే గాజా నగరంలో భవనాలే మిగలలేదని, శిథిలాల కిందే ప్రజలు నివసిస్తున్న పరిస్థితి తీవ్రంగా కలచివేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో గాజా భవితవ్యంపై అంతర్జాతీయ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ నిర్ణయాలు, హమాస్‌ వైఖరి, అంతర్జాతీయ చర్చల ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.