ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాక్స్కు సాహిత్య నోబెల్
ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాక్స్ సాహిత్య విభాగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ మేరకు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఇది ఎంతో గౌరవం అని, అలాగే, బాధ్యత కూడా అని రచయిత్రి స్పందించారు.
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాక్స్ ఈ ఏడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 82 ఏళ్ల ఎర్నాక్స్ ధైర్యం, ప్రయోగాలతో వ్యక్తిగత జ్ఞాపకాలకు అడ్డుగా నిలుచున్న సామూహిక బంధనాలను చీల్చుకుంటూ మూలాలు, వేరుపడి ఉండటానికి సంబంధించిన విషయాలను ఆవిష్కరించారని నోబెల్ జ్యూరీ పేర్కొంది.
1940లో వెటోట్ అనే చిన్న పట్టణంలో నార్మండీ తెగలో ఆనీ ఎర్నాక్స్ జన్మించారు. ఆమె తన మూలాలు, నార్మన్ తెగ మూలాల గురించి భిన్న కోణాలు, పార్శ్వాలను తాకుతూ ఆవిష్కరించారు. మూలాల గురించి దర్యాప్తునే చేపట్టారు. ఇందుకు సంబంధించిన తన వ్యక్తిగత అనుభవాలు, ఆవిష్కరించిన కోణాలను ఆమె అక్షరబద్ధం చేశారు. వాటిని నవలలుగా రచించారు. లింగం, భాష, వర్గం వంటి అనేక అసమానతలను ఎత్తి చూపారు. రచయిత్రిగా ఆమె ప్రయాణం సుదీర్ఘమైనది అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది.
నోబెల్ పురస్కారాన్ని గెలుచుకోవడంపై రచయిత్రి ఆనీ ఎర్నాక్స్ స్పందించారు. నోబెల్ పురస్కారం పొందడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ పురస్కారం గౌరవంతో పాటు పెద్ద బాధ్యతను కూడా వెంట తెచ్చిందని వివరించారు.
నోబెల్ ప్రైజ్గా 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు గెలుచుకున్నవారికి అందుతాయి.