బహిరంగంగా డ్యాన్స్ చేసిన జంటకు పదేళ్ల జైలు శిక్ష.. వీడియో ఇదే
ఇరాన్లో బహిరంగంగా డ్యాన్స్ చేసిన ఓ జంటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారి డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ఆ జంటను అరెస్టు చేసి పలు కేసులు పెట్టి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూఢిల్లీ: ఇరాన్ నిరంకుశ ప్రభుత్వం ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. హిజాబ్ వ్యతిరేక నిరసనలు అణచివేయడంలో భాగంగా కఠిన శిక్షలు అమలు చేస్తున్నది. మరణ శిక్షలను భారీగా పెంచింది. జైలు నిర్బంధంలోనూ ఖైదీలపై దారుణంగా వ్యవహరిస్తున్నది. ఈ విషయం మరోసారి రూఢీ అయింది. ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన ఓ జంట బహిరంగ ప్రదేశంలో సరదాగా డ్యాన్స్ చేశారు. అదే వారు చేసిన నేరమైంది. వారిని పట్టుకుని బంధించి జైలులో పడేసింది. ఇరాన్ ప్రభుత్వం పలు అభియోగాలు మోపింది. ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారిపై మోపిన అభియోగాలు అన్నింటిలో దోషులుగా తేల్చితే ఈ జైలు శిక్ష ఇంకా చాలా సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉన్నదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
21 ఏళ్ల అస్తియాజ్ హకికీ, ఆమెను పెళ్లాడబోయే మొహమ్మద్ అహ్మదీ జంట దేశ రాజధాని టెహ్రాన్లోని ఆజాదీ టవర్ వద్ద చాలా సాధారణంగా డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ను వారు తమ ఫాలోవర్లతో పంచుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అదీ కొన్ని క్షణాలు మాత్రమే సాగే వీడియో. అందులో ప్రభుత్వ వ్యతిరేకత.. లేదా హిజాబ్ ఆందోళనలకు సమర్థన కూడా కనిపించదు. కానీ, బహిరంగంగా డ్యాన్స్ చేయడం మూలంగా వారి పై పలు కేసులు పెట్టి జైలుకు పంపింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ఇరాన్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారిపై ప్రాస్టిట్యూషన్ను ప్రోత్సహిస్తున్నారనే అభియోగమే కాదు.. ఏకంగతా దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్ర చేశారని, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతోనూ కేసులు పెట్టింది. ఈ నేరాలకు గాను వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వం మోపిన ప్రతి అభియోగంలో వారు దోషులుగా తేలితే మాత్రం శిక్ష కాలం మరెన్నో రెట్లు పెరిగే ముప్పు ఉన్నదని తెలుస్తున్నది.