మైఖెలాంజిలో చెక్కిన విగ్రహాన్ని విద్యార్థులకు చూపించినందుకు ప్రిన్సిపాల్పై ఒత్తిడి.. రాజీనామా
అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాలోని ఓ స్కూల్లో ఆరో తరగతి విద్యార్థులకు మైఖెలాంజిలో విగ్రహాన్ని చూపించారు. దీంతో ఆ తర్వాత ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: మైఖెలాంజిలో చెక్కిన డేవిడ్ విగ్రహాన్ని విద్యార్థులకు చూపించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆరో తరగతి పిల్లలకు పోర్నోగ్రఫీ చూపించారని తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు. ఈ లెస్సన్ చెబుతున్నామని తమకు ముందే చెప్పాల్సిందని తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఈ పరిణామాల తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్కు యాజమాన్యం రెండే ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి తాము తొలగించడం, రెండు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం. ఆ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ స్కూల్ ప్రిన్సిపాల్గా హోప్ కారాస్క్విలా చేస్తున్నారు. అది తలహసీ క్లాసికల్ స్కూల్. ఆ రోజు ఆరో తరగతి పిల్లలకు రెనాయెసెన్స్ ఆర్ట్ గురించి పాఠం చెబుతున్నారు. అందులో మైఖెలాంజిలో చెక్కిన డేవిడ్ విగ్రహం గురించి ఉన్నది. డేవిడ్ విగ్రహం పూర్తిగా నగ్నంగా ఉంటుంది. పాశ్చాత్య చరిత్రలో ఈ విగ్రహానికి ప్రాముఖ్యత ఉన్నది.
తమ పిల్లలకు డేవిడ్ విగ్రహాన్ని చూపించి పోర్నోగ్రఫిక్కు ఎక్స్పోజ్ చేశారని ఓ స్టూడెంట్ పేరెంట్ ఫిర్యాదు చేశారు. ఈ క్లాసు చెబుతున్నట్టు తమకు ముందే సమాచారం ఇవ్వలేదని ఇద్దరు తల్లిదండ్రులు ఆగ్రహించారు.
అయితే, తాము ఆ పిక్చర్ బ్యాన్ చేయడం లేదని ఆ స్కూల్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఈ పాఠం చెప్పడానికి ముందు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇన్ఫమ్ చేశామని వివరించాయి. కానీ, ఈ సారి ప్రిన్సిపాల్ ఆ పని చేయడంలో విఫలం అయ్యారని పేర్కొన్నాయి.