పెండింగ్లో కరెంట్ బిల్లులు.. ఇంట్లోకి దూరి వస్తువులు పట్టుకెళ్లిన అధికారులు.. బైక్లు, పశువులను సైతం
మధ్యప్రదేశ్లో పెండింగ్ విద్యుత్ బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టారు. కరెంట్ బిల్లు పెండింగ్లో ఉన్నవారి ఇంటిలోకి అధికారులు దూరి వస్తువులను, బెడ్లను పట్టుకెళ్లుతున్నారు. బైక్లు, వాటర్ పంప్లు, పశువులను తీసుకెళ్లుతున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భోపాల్: మధ్యప్రదేశ్లో పెండింగ్ కరెంట్ బిల్లుల వసూలు డ్రైవ్ వివాదాస్పదమైంది. కరెంట్ బిల్లులు చెల్లించని వారి ఇళ్లలోకి బిల్ కలెక్టర్లు దూసుకెళ్లి వస్తువులను పట్టుకెళ్లారు. వారి ఇంటి వద్ద కనిపించిన బైక్లు, వాటర్ పంప్లు, ట్రాక్టర్లను సైతం సీజ్ చేసుకుని తీసుకెళ్లారు. పశువులను కూడా వెంటబెట్టుకు వెళ్లారు. ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫలితంగా ఈ డ్రైవ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఘటనతో ప్రమేయమున్న ఇద్దరు కాంట్రాక్టు వర్కర్లను సర్వీస్లో నుంచి తొలగించి దర్యాప్తునకు ఆదేశించారు.
మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెండింగ్ విద్యుత్ బకాయిలను వసూలు చేసే డ్రైవ్ మొదలు పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రూ. 518 కోట్ల పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని మధ్యప్రదేశ్ ఈస్ట్రన్ ఏరియా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెండ్ ఓ డ్రైవ్ ప్రారంభించింది.
ఇందులో భాగంగా అధికారులు బిల్లు పెండింగ్లో ఉన్న ఇళ్లల్లో నుంచి వస్తువులను సీజ్ చేస్తున్నారు. వాటిని ఓ ట్రాలీలో వేసుకుని వేరే చోటుకు తరలిస్తున్నారు. మోటార్ బైక్లు, వాటర్ పంప్లు, ట్రాక్టర్లు, పశువులను కూడా తీసుకెళ్లుతున్నారు. సాగర్, దామోహ్, ఛత్తర్పూర్, పన్నా, గ్వాలియార్, మోరేనా జిల్లాల్లో ఈ డ్రైవ్ జరుగుతున్నది. ఈ జిల్లాల్లో చాలా మందిని పెండింగ్ కరెంట్ బిల్లులకు సంబంధించి నోటీసులు వెళ్లాయి. అందులో చాలా మంది వాహనాలను అధికారులు సీజ్ చేశారు.
శనివారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల బృందం సాగర్ జిల్లా డియోరిలోని రేఖా ఆహిర్వార్ ఇంటికి వెళ్లింది. ఆ ఇంటి మీటర్పై రూ. 19,473 బిల్లు పెండింగ్లో ఉన్నది. అధికారులు వెళ్లినప్పుడు అక్కడ రేఖా ఆహిర్వార్ ఇంటిలో లేరు. వృద్ధురాలైన ఆమె అత్త ఉన్నది. ఆమె స్నానం చేస్తున్నది.
ఆ సమయంలోనే అధికారులు నేరుగా వారి ఇంటిలోకి వెల్లి బెడ్, ఇతర గృహోపకరణాలను బయటకు తీసుకుని ఓ ట్రాలీలో వేశారు. వాటిని తీసుకెళ్లొద్దని ఆ పెద్దావిడ అధికారులను వేడుకుంది. తమకు రేఖా ఆహిర్వార్తో సంబంధం లేదని చెప్పినా వారు వినిపించుకోలేదు. బట్ట కూడా సరిగా కట్టుకోకుండానే ఆ వస్తువుల కోసం ఆమె ట్రాలీ వద్దకు వెళ్లింది. అర్ధనగ్నంగా ఉన్న ఆ మహిళ వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా చేయడం తప్పని నెటిజన్లు వాదించారు. అవసరమైతే వారు పవర్ కనెక్షన్ కట్ చేసుకోవాలని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు కట్టడం లేదంటే వారికి నోటీసులు పంపాలని తెలిపారు. అంతేకానీ, దౌర్జన్యంగా ఇంట్లోకి దూరి వారి వస్తువులను ఎత్తుకెళ్లడం సమంజసం కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యం లోనే శివరాజ్ ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించింది. దర్యాప్తునకు ఆదేశించింది.