ఇరాన్లో భూకంపం.. కనీసం ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు
ఇరాన్లో భూకంపం సంభవించింది. ఇందులో కనీసం ఏడుగురు మరణించారు. 440 మంది గాయపడ్డారు. వెస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో టర్కీ, ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఈ భూకంపం సంభవించింది. కాగా, ఇరాన్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడులు విఫలం అయ్యాయని వివరించింది.
టెహ్రాన్: ఇరాన్కు వరుసగా సవాళ్లు ఎదురయ్యాయి. ఒక వైపు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే భూకంపం ఒకటైతే.. ఇజ్రాయెల్ విసిరే సవాళ్లు మరో వైపు ఉంటున్నాయి. ఇరానియన్ సెస్మలాజికల్ సెంటర్ ప్రకారం, శనివారం రాత్రి 9.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతతో భూ కంపం వచ్చింది. 7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా కనీసం ఏడుగురు మరణించారు. సుమారు 440 మంది ప్రజలు గాయపడ్డారు. ఇరాన్ నార్త్ వెస్త్లోని ఖోయ్ నగరంలో ఈ భూకంపం ప్రధానంగా దాని ప్రభావాన్ని చూపింది. పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లో ఈ భూకంపం కారణంగా ఏడుగురు మరణించారని, 440 మంది గాయపడ్డారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వెస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో టర్కీ, ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఈ భూకంపం సంభవించింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ సెంట్రల్ సిటీ ఇసఫాహాన్లో ఓ మిలిటరీ ప్లాంట్లో పేలుడు సంభవించిందని, డ్రోన్ దాడి మూలంగా ఈ పేలుడు సంభవించిట్టు ఇరాన్ జాతీయ మీడియా ఆదివారం రిపోర్టు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్గాల నుంచి సమాచారాన్ని పేర్కొంటూ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ పై మూడు డ్రోన్లతో దాడికి ప్లాన్ చేశారని వివరించింది. ఇందులో ఒకటి ఎయిర్ డిఫెన్స్ వద్ద పేలింది. మిగితా రెండు డ్రోన్లు ఇరాన్ రక్షణ శాఖ వేసిన వలకు చిక్కి పేలి పోయాయని వివరించింది.
అదృష్టవశాత్తు శత్రువుల కుట్ర సఫలం కాలేదని, ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించింది. అయితే, వర్క్ షాప్ రూఫ్కు కొంత మైనర్ డ్యామేజీ జరిగిందని ఇరాన్ జాతీయ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏలో ఇరాన్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.