UPSC Civil Services:  కష్టపడితే సాధించలేనిదేదీ లేదని వారు మరోసారి నిరూపించారు. జీవితంలో ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించి తలరాతను మార్చుకున్నారు. గొర్రెల కాపరులే అయినా.. ఆల్‌ ఇండియా లెవల్‌లో జరిగిన సివిల్స్‌ పరీక్షల్లో లక్షలాది మందిని వెనక్కి నెట్టి... కొలువు సాధించారు.   

దేనికైనా అదృష్టం ఉండాలని అందరూ చెబుతుంటారు. కానీ కష్టపడితే అదృష్టం ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. ఇక మన చుట్టూ.. అనేక మంది చేరి .. ఏదైనా మనకు రాత లేదు, రాసిలేదు అని ఇలాంటి కాలక్షేపం మాటలు చెప్పేవారిని పట్టించుకోవద్దు. గెలుపు ఏ ఒక్కరి సొత్తు కాదు.. సాధించాలనే కసి, పట్టుదల, నిరంత శ్రమ ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. సరిగ్గా దీన్ని నిజం చేస్తూ.. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరు కొడుకులు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకరు ఐపీఎస్ అధికారి కాబోతుండగా.. మరొకరికి సర్వీసెస్‌లో ఏదో ఒకదానికి వెళ్లనున్నారు. 

కర్నాటక రాష్ట్రానికి చెందిన బీరప్ప ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 554 ర్యాంకు సాధించి ఐపీఎస్‌ కొలువుకు ఎంపికయ్యాడు. ఇతని తండ్రి సిద్దప్ప గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సిద్దప్పతోపాటు బీరప్ప కూడా అప్పుడప్పుడూ గొర్రెలు మేపేందుకు పొలానికి వెళ్తుంటారట. ఇక బీరప్ప  బిటెక్‌ వరకు చదువుకుని తన అన్నయ్యలా ఆర్మీలోకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ఆ లక్ష్యం చేరుకోలేకపోయాడు. ఈక్రమంలో ఇండియన్‌ పోస్ట్‌లో ఉద్యోగం సాధించాడు. కొన్నాళ్లు ఆ ఉద్యోగమే చేశాడు. 


ఇండియన్‌ పోస్టులో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే బీరప్పకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్దం అయ్యాడు. రెండు సార్లు పరీక్షలు రాయగా.. కనీసం క్వాలిఫై కూడా కాలేదు. ఇక ఉద్యోగం చేస్తూ.. ప్రిపేర్‌ అవ్వడం కష్టమని భావించి వెంటనే ఇండియా పోస్టులో ఉద్యోగానికి రాజీనామ చేసి ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేశాడు. ఎక్కడా నిరాశ చెందకుండా..  మనకేమి వస్తుందిలే.. సివిల్స్‌ స్థాయి మనది కాదు అనే మాటలు తన దరికి రాకుండా నమ్మకంతో కష్టపడి అవివిరామంగా చదివాడు. 

అలా గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించాడు. కుగ్రామం నుంచి వచ్చిన బీరప్ప సివిల్స్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంపై అతని గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇక గొర్రెలతో తన జీవితాన్ని సాగించే కుటుంబం నుంచి వచ్చి యూపీఎస్సీలో  551వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించిన బీరప్పను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఫోన్‌ చేసి అభినందించాడు. మరో విశేషమేమిటంటే.. సెలవుల మీద బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప.. బెళగావి సమీపంలోని నానావాడిలోని ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో సివిల్స్‌ ఫలితాలు వచ్చాయని తెలుసుకుని, చెక్‌ చేసుకోవగా.. 551వ ర్యాంకు వచ్చినట్లు గుర్తించి ఎగిరి గంతేశాడు. 

తండ్రి ఇచ్చిన బహుమతి అదే.. 
బీరప్ప ఐపీఎస్‌ కొలువు సాధించినందుకు తండ్రి సిద్ధప్ప, తల్లి బాలవ్వ, కుటుంబ సభ్యులు కలిసి హారతిచ్చి, పూలమాల వేసి సత్కరించారు. అనంతరం బీరప్పకు ఓ గొర్రె పిల్లను కూడా బహుమతిగా ఇవ్వడం విశేషం. ఈ సందర్బంగా బీరప్ప తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు కష్టపడే విధానం చూసి ఏదొక మంచి ఉద్యోగం వస్తుందని అనుకున్నానని, ఈక్రమంలో పోలీస్ అధికారి కొలువు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 

తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉందని, చుట్టు పక్కన ఉన్నవారు కూడా తన కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని చెబుతుండేవారని సిద్దప్ప ఆనందంగా చెబుతున్నారు. పరీక్షలకు చాలా కష్టపడ్డాడని అన్నాడు. 

మరో గొర్రెల కాపరి కుమారుడికి 910వ ర్యాంకు.. 

కర్నాటక సరిహద్దు బెళగావిలోని కోడ్లివాడ్‌కు చెందిన మరో గొర్రెల కాపరి కుమారుడు హనుమంతప్ప యల్లప్ప నంది సివిల్స్‌లో 910వ ర్యాంక్‌ సాధించాడు. ఇతనిదీ పేద కుటుంబమే. అయినా అడ్డంకులు అధిగమించి సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు. నంది విజయం సాధించడంపై తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు ఒకటి నుంచి 10 వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేశారు. ధార్వాడ్‌లోని కర్ణాటక కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెళగావిలోని గోగ్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత సివిల్స్‌కు సిద్దమై మంచి ర్యాంకు సాదించి ఉద్యోగం తెచ్చుకున్నాడు.