ind-pak: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్తో పలు ఒప్పందాలు రద్దు చేసుకుంది. దీంతోపాటు.. వీసాలపై వచ్చిన పాక్ పౌరులు ఇండియాను వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీఎంతో కూడా కేంద్ర మంత్రి అమిత్షా ఫోన్లో మాట్లాడి.. ఇదే విషయం చెప్పారు. 48 గంటల్లో భారత్ను వదిలి వెళ్లాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. సుమారు 107 పాకిస్తానీయులు మిస్సయ్యారని తెలుస్తోంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్తాన్తో సంబంధాలు తెంచుకునేందుకు భారత్ సిద్దమైంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసింది. అయితే.. మహారాష్ట్ర సర్కార్ చెబుతున్న అధికారిక సమాచారం మేరకు.. భారత పౌరులను పెళ్లి చేసుకున్నవారు, లాంగ్ టర్మ్, రెన్యూవల్ వీసాలు, ఇతర వీసాలపై మొత్తం 5,023 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట.
వారిలో అధికారిక లెక్కల ప్రకారం.. 250 మందిని వెనక్కి పంపారు అధికారులు. ఇక షార్ట్ టర్మ్ వీసాలపై వచ్చిన వారిని దేశం నుంచి బహిష్కరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలా సుమారు మహారాష్ట్రలో 250 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించి వారిని ఇప్పటికే పంపించేశారు.
107 మంది అడ్రస్ గల్లంతు.. ఇదే డేంజర్...
పాకిస్తాన్ నుంచి వచ్చిన 107 మంది పౌరుల జాడ తెలియడం లేదని మహారాష్ట్ర అధికారులు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వారి ఆచూకీ తెలియలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు.. వారందరూ తీవ్రవాదులేనా? ఇండియాకి వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో 34 మంది నకిలీ పత్రాలతో భారత్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించిడం షాక్కి గురిచేస్తోంది.
వీరి ఆచూకీ కోసం పోలీసులు, కేంద్ర సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో ముంబయి నగరంలో జరిగిన దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అదృశ్యమైన పాకిస్తానీయుల కోసం క్షున్నంగా గాలింపు చేపట్టారు.