బిజేపితో పొత్తు... కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహం
కేవలం ఒకటి రెండు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీజేపీ తో చేతులు కలపడంపై కాంగ్రెస్ సీనియర్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్థానాలు దక్కకపోయినా ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కేవలం ఒకటి రెండు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీజేపీ తో చేతులు కలపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దీనిపై పెదవి విరుస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు చూసిందని తెలంగాణలో కూడా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదని వ్యాఖ్యలు చేస్తూనే.... అంతమాత్రాన బిజెపితో చేతులు కలపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పిసిసి నాయకత్వం స్థానిక అవసరాలకు అనుగుణంగా బిజెపి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని మాజీ ఎంపి విహెచ్ తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంత పరంగా ఏవైనా మార్పులు వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై విమర్శలు తీవ్రం అయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ల పొత్తుపై అధికార పార్టీ నేతలు ఆ రెండు పార్టీల పొత్తును తప్పు బడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల పై త్వరలోనే పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు విహెచ్ రెడీ అవుతున్నారు.
read more గెలిచి ఓడిన రెబెల్స్.. పార్టీలో దక్కని ప్రాధాన్యత
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలను పూర్తి మెజారిటీతో సాధించుకుంది. మరికొన్ని మున్సిపాలిటీలను ఎక్స్ అఫిషియో సభ్యులతో గెలుచుకుంది. కాంగ్రెస్, బిజెపి లు మున్సిపల్ ఎన్నికలను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఒకటి, రెండు మునిసిపాలిటీల్లో పాలక మండళ్లను ఏర్పాటు చేశాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీలుగా ఉన్న రెండు పార్టీలు ప్రాంతీయంగా కలిసి పోవడం దేనికి సంకేతాలనే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలు లెవనెత్తుతున్నారు. కాంగ్రెస్- బిజెపి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకున్నా సీట్లు సాధించడంలో వెనుకబడ్డాయి.
read more కెసిఆర్ దేశానికి...కెటిఆర్ రాష్ట్రానికి...: గంగుల కమలాకర్ వ్యాఖ్యలు